Akhilesh Yadav | స్పెషల్ టాస్క్ బ్యూరో హైదరాబాద్, జూలై 4 (నమస్తే తెలంగాణ): చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు కాంగ్రెస్కి ఇంకా పెద్దరికం మీద ఆశ చావడం లేదు. బీజేపీని ఎదిరించే శక్తి లేక, సొంతంగా అధికారంలోకి వచ్చే సత్తువ లేక, ప్రాంతీయ పార్టీల భుజాలమీదికెక్కి సింహాసనం అందుకోవాలని చూస్తున్నది. కనీసం అందులోనైనా నిజాయితీ ఉందా? అంటే అదీలేదు. విపక్షాలను చీల్చి, తనకు అనుకూలం, వ్యతిరేకం అంటూ విభజించి పాలించే ఎత్తుగడలు. దేశంలో రాజకీయాలు మారిపోయాయని, విపక్ష పార్టీలు ఇంకా తన మాయలో పడే ప్రసక్తే లేదని కాంగ్రెస్ గుర్తించడం లేదు. గత రెండు రోజుల్లో జరిగిన పరిణామాలే ఇందుకు నిదర్శనం. ‘బీఆర్ఎస్ హాజరయ్యే ఏ సమావేశానికీ కాంగ్రెస్ హాజరు కాబోదు. ఇదే విషయాన్ని నేను ప్రతిపక్షాలన్నింటికీ స్పష్టంచేశాను’ అని రాహుల్గాంధీ ఖమ్మం సభలో గొప్పలకు పోయారు.
విపక్ష పార్టీల సమావేశానికి బీఆర్ఎస్ హాజరుకాకపోవడానికి తానే కారణమని క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేశారు. ఇది ఎంత అబద్ధమో 24 గంటలు గడవక ముందే రుజువైంది. విపక్ష పార్టీల్లో అత్యంత ప్రధానమైన, యూపీలో కీలకమైన సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేశ్యాదవ్ స్వయంగా హైదరాబాద్కు వచ్చి, ముఖ్యమంత్రి కేసీఆర్తో నాలుగు గంటలపాటు మంతనాలు జరిపారు. బీజేపీని గద్దె దించడంలో కలిసి పనిచేద్దామని, తమకు సహకరించాలని విన్నవించారు. బీఆర్ఎస్పై అంటరాని ముద్ర వేసే రాహుల్ ప్రయత్నాలకు తాము సహకరించే ప్రసక్తే లేదని అఖిలేశ్, హైదరాబాద్ సందర్శన ద్వారా స్పష్టంచేశారు. బీజేపీని గద్దె దించాలనే లక్ష్యంలో భాగంగానే కాంగ్రెస్తో సమావేశాల్లో పాల్గొంటున్నాం తప్ప, ఆ పార్టీ పెట్టే షరతులకు తలొగ్గే సమస్యే లేదని తేల్చిచెప్పారు.
రాహుల్ మాటల్లో మరో దారుణం ఏమిటంటే, విపక్షాల సమావేశాల్లో పాల్గొనడానికి బీఆర్ఎస్ తహతహలాడుతున్నట్టు, కాంగ్రెస్ దాన్ని అడ్డుకుంటున్నట్టు పోజివ్వడం. కూట మి సంస్కృతికి తాము వ్యతిరేకమని కేసీఆర్ ముందే స్పష్టంచేశారు. ఫ్రంట్లు- టెంట్లపై ప్రజలకు నమ్మకం లేదని తేల్చిచెప్పారు. దేశవ్యాప్తంగా ఎన్నికల్లో పోరాడతామని, ఎవరితో పొత్తులు ఉండవనీ స్పష్టంచేశారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ దేశానికి పట్టిన దరిద్రమని ప్రకటించారు. దేశానికి కావాల్సింది ఒకర్ని దించి మరొకర్ని పెంచే ప్రత్యామ్నాయ రాజకీయాలు కావని చెప్పారు. ప్రజల్ని గెలిపించే ప్రత్యామ్నాయ పరిపాలన విధానాలు అవసరమని వివరించారు. ఈ పరిస్థితిలో కాంగ్రెస్… బీఆర్ఎస్ను పక్కనబెట్టిందా? బీఆర్ఎస్సే కాంగ్రెస్ను పక్కకు నెట్టిందా? బుర్రున్న ఎవరికైనా అర్థమవుతుంది. దేశ రాజకీయాల్లో రోజురోజుకూ దిగజారుతూ రెలవెన్స్ కోల్పోతున్నది కాంగ్రెస్ అయితే, విజయవంతమైన తెలంగాణ మాడల్తో దేశ రాజకీయ పార్టీలను, ప్రజలను, మేధావులను ఆకర్షిస్తున్నది కేసీఆర్- బీఆర్ఎస్!
75 ఏండ్లపాటు దేశాన్ని భ్రష్టుపట్టించిన బీజేపీ, కాంగ్రెస్లకు ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రతిపాదిస్తూ బీఆర్ఎస్ ఇవాళ దేశ రాజకీయాల్లోనే కేంద్ర బిందువుగా మారింది. అనేక పార్టీల, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులు తెలంగాణను చూసి, అక్కడి అభివృద్ధి మాడల్ను తమ ప్రాంతాల్లోనూ అమలు చేయాలని తహతహలాడుతున్నారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ల్లో కూడా బీఆర్ఎస్ విస్తరిస్తున్నది. తమ నెక్ట్స్ టార్గెట్ మధ్యప్రదేశ్ అని కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. దశాబ్దాలపాటు కేంద్రంలో అధికారాన్ని అనుభవించి, దేశాన్ని పట్టిం చుకోని బీజేపీ, కాంగ్రెస్లను పక్కనబెడితే.. బీఆర్ఎస్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారింది. 9 ఏండ్ల బీజేపీ పాలనలో విధానాల ఆధారంగా ప్రధాని మోదీని కేసీఆర్ అంత సూటిగా, ఘాటుగా నిలదీసిన నాయకుడు మరొకరు లేరు.
దీన్ని దేశవ్యాప్తంగా మేధావులు కూడా హర్షిస్తున్నారు. బీజేపీని ఎదురించగలిగేది కేసీఆర్ ఒక్కరేనని నమ్ముతున్నారు. తమ కాళ్ల కింద నేలను కదిలిస్తున్నదన్న భయంతోనే మొన్న మధ్యప్రదేశ్లో మోదీ, నిన్న ఖమ్మంలో రాహుల్, అంతకుముందు మహారాష్ట్రలో పవార్, ఫడ్నవీస్, రౌత్, తదితరులు బీఆర్ఎస్ను- కేసీఆర్ టార్గెట్గా మాట్లాడారు. కేసీఆర్తో అఖిలేశ్ భేటీ జాతీయ ప్రసార సాధనాల్లో ప్రైమ్టైమ్ టాపిక్గా మారింది. కేసీఆర్తో కలిసి పని చేస్తామని, కాంగ్రెస్పై నమ్మకం లేదని ఆప్ నేత కేజ్రీవాల్ ఇప్పటికే ప్రకటించారు. కానీ, తామేమో బీఆర్ఎస్ను నియంత్రిస్తున్నట్టు, దానికి పాత్ర లేకుండా చేస్తున్నట్టు రాహుల్గాంధీ మాట్లాడటం ఆయన రాజకీయ అవగాహన లేమిని నిరూపిస్తున్నదని పరిశీలకులు పేర్కొంటున్నారు.