జైనథ్, ఫిబ్రవరి 29: సోయా పంట కొనుగోళ్లను నిలిపివేయడాన్ని నిరసిస్తూ గురువారం ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలోని అంతర్రాష్ట్ర రహదారిపై రైతులు, బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. గంటపాటు వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు అవస్థలుపడ్డారు. మాజీ ఎంపీపీ, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేర్ లింగారెడ్డి మాట్లాడుతూ.. జైనథ్, బేల, ఆదిలాబాద్ మార్కెట్ యార్డుల్లో మార్క్ఫెడ్ సోయాను ఒకరోజు కొనుగోళ్లు చేసి ఆ తరువాత నిలిపివేసిందని మండిపడ్డారు.
మార్క్ఫెడ్ కొనుగోలు చేస్తుందన్న నమ్మకంతో రైతులు సోయా నిల్వలను తీసుకొచ్చి పడరాని పాట్లు పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. మరో వారంలో సోయా, శనగ ఉత్పత్తులను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు చేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసనలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మనోహర్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎం ప్రహ్లాద్, గిమ్మ ఎంపీటీసీ కోల భోజన్న, అకోలి సర్పంచ్ కేశవ్, జైనథ్ మార్కెట్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.