హైదరాబాద్ : వాతావరణ శాఖ రైతులకు శుభవార్త చెప్పింది. తెలంగాణలోకి సోమవారం నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశాలున్నాయని పేర్కొంది. గోవా, కొంకణ్, కర్నాటక ప్రాంతాల్లో శనివారం నాటికి విస్తరించాయని తెలిపింది. పశ్చిమ భారత తీర ప్రాంతాల్లో విస్తరించిన నేపథంలో ఆది, సోమవారాల్లో రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయని అంచనా వేస్తున్నది.
రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు ముందుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. పశ్చిమ భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని.. వీటి ప్రభావంతో ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా.. మరికొన్ని చోట్ల ఎండలు దంచికొడుతున్నాయి.
40 డిగ్రీలకుపైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్లోనూ ఎండలు భారీగానే ఉన్నాయి. దీంతో ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇదిలా ఉండగా.. శనివారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా బేలలో 4, తలమడుగులో 3.5, పిప్పల్ధరిలో 3.3, వడ్యాల(నిర్మల్)లో 2.9, మేనూరు(కామారెడ్డి)లో 2 సెంటీమీటర్ల వర్షాపాతం నమోదైంది.