Monsoon | హైదరాబాద్, మే 13 (నమస్తేతెలంగాణ): దేశ ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు పంపింది. దేశానికి అత్యధిక వర్షపాతాన్నిచ్చే నైరుతి రుతుపవనాలు మంగళవారం మధ్యాహ్నం నాటికే దక్షిణ అండమాన్ సముద్రం, నికోబార్ దీవులు, దక్షిణ బంగాళాఖాతాన్ని తాకినట్టు శాఖ వెల్లడించింది.
బుధవారం ఆగ్నే య బంగాళాఖాతంలో ఆవర్తనం ఏర్పడే అవకాశాలున్నట్టు ఆ శాఖ అధికారులు తెలిపారు. రుతుపవనాల ఆగమనంతో గత రెండు రోజులుగా నికోబార్ దీవుల్లో భారీ వర్షాలు పడుతున్నాయని పేర్కొన్నది. రానున్న మూడు, నాలుగు రోజుల్లో అండమాన్ నుంచి దక్షిణ అరేబియా సముద్రం, బంగాళాఖాతం మధ్య వరకు విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది.
మరింత చురుగ్గా ముందుకు కదులుతున్న రుతుపవనాలు మే 27 నాటికి కేరళను తాకుతాయని తెలిపింది. జూన్ 12న తెలంగాణకు నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. రాష్ట్రంలో ఈసారి సాధారణం కంటే అధిక వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. రుతుపవనాల రాకతో రాష్ట్రంలో మరో వారం రోజుల్లో అధిక ఉష్ణోగ్రతల ప్రభావం ముగియనున్నదని వాతావరణ శాఖ వెల్లడించింది.
రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు
రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసినట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. సిద్దిపేట, జనగామ, ఆదిలాబాద్, కొత్తగూడెం, ఆసిఫాబాద్, నిర్మల్, మహబూబాబాద్, భువనగిరి, కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసినట్టు వెల్లడించింది. వివిధ చోట్ల పిడుగులు పడినట్టు పేర్కొన్నది.