హైదరాబాద్ : నైరుతి రుతుపవనాలు ఈ నెల 9, 10 తేదీల్లో ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. గతేడాది జూన్ 6న ప్రవేశించిన రుతుపవనాలు.. మూడు రోజుల్లోనే రాష్ట్రమంతా విస్తరించాయి. అయితే, గతేడాది కంటే మూడు నాలుగు రోజులు ఆలస్యంగా రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయని వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త శ్రావణి తెలిపారు. సాధారణ సమయంలో వస్తున్న రుతుపవనాలేనని పేర్కొన్నారు.
మధ్య ప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా రాయలసీమ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని, దీని కారణంగా మంగళవారం రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైయ్యాయన్నారు. 29 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవగా.. 45 డిగ్రీలపైన పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, నిర్మల్, జయశంకర్ భూపాల్పల్లి, మంచిర్యాల, ఆదిలాబాద్, కుమ్రభీం ఆసిఫాబాద్, సూర్యాపేట జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు టీఎస్డీపీఎస్ తెలిపింది. అత్యధికంగా పెద్దపల్లి జిల్లా ముత్తారం 45.8, కరీంనగర్ జిల్లా వీణవంక, జగిత్యాల జిల్లా మల్లాపూర్ 45.7 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
అయితే, సాయంత్రం వేళల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పలు జిల్లాల్లో కురుస్తున్నాయని తెలిపారు. ఈ నెల 9వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పలు చోట్ల వచ్చే అవకాశం ఉందన్నారు. 11వ తేదీ వరకు సాధారణ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. రైతులు వర్షాలు కురుస్తున్నాయని విత్తనాలు వేసుకోవద్దని వాతవరణ శాస్త్రవేత్త శ్రావణి సూచించారు. దుక్కులు సిద్ధం చేసుకోవాలని, రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించి, వర్షాలు కురిసిన తర్వాతే విత్తనాలు వేసుకోవాలని తెలిపారు.