Monsoon | హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): వారం రోజులుగా దోబూచులాడుతున్న నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు కేరళను తాకాయి. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారికంగా ఈ విషయాన్ని నిర్ధారించింది. ప్రస్తుతం కేరళను తాకిన ఈ రుతుపవనాలు ఈ నెల 16, 17 తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశం ఉన్నది. లక్షద్వీప్, కేరళ ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. దాంతో గత 24 గంటలుగా కేరళలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 48 గంటల్లో కేరళలోని ఇతర ప్రాంతాలతోపాటుగా కర్ణాటక, తమిళనాడు మీదుగా రుతుపవనాలు కదలనున్నాయని వెల్లడించింది. గంటకు 19 నాట్స్ వేగంతో పశ్చిమ గాలులు వీస్తున్నట్టు ఐఎండీ వివరించింది.
వారం రోజుల ఆలస్యంగా ఆగమనం
సాధారణంగా జూన్ 1నాటికి నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశిస్తుంటాయి. వారం రోజులు ఆలస్యంగా దేశంలోకి వచ్చాయని వాతావరణశాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ఆగమనంతో అలప్పుజ, ఎర్నాకుళం ప్రాంతాల్లో ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. నిరుడు మే 29న రుతుపవనాలు దేశంలోకి రాగా.. 2021లో జూన్ 3న ప్రవేశించాయి.
రాష్ట్రంలో నేడు, రేపు అక్కడక్కడ వానలు
రాష్ట్రంలో వచ్చే రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో వర్షాలు కురిసే సూచనలున్నాయని పేర్కొన్నది. పలు జిల్లాల్లో వడగాలులు వీస్తాయని తెలిపింది.
పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ
శుక్రవారం నుంచి శనివారం ఉదయం వరకు సిద్దిపేట, యాదాద్రి-భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ-గద్వాల జిల్లా ల్లో ఈదురుగాలులతో వర్షాలు కురవొచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.