మూడురోజుల ముందే ఆగమనం
7 లేదా 8న రాష్ట్రంలోకి ప్రవేశం
2 వరకు తేలికపాటి వర్షాలు, వారం పాటు ఎండలు
హైదరాబాద్ వాతావరణ కేంద్రం
హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ) : నైరుతి రుతుపవనాలు మూడు రోజుల ముందే ఆదివారం ఉదయం కేరళలోకి ప్రవేశించినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కేరళ తీరంతో పాటు దానిని ఆనుకొని ఉన్న అరేబియా సముద్రం, లక్షద్వీప్లలో కూడా ప్రవేశించాయని పేర్కొన్నది. వచ్చే మూడు రోజుల్లో రుతుపవనాలు కేరళ అంతటా విస్తరిస్తాయని, తమిళనాడు, కర్ణాటక, దక్షిణ అరేబియా, మధ్య బంగాళాఖాతంతో పాటు ఈశాన్య రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాల్లో ప్రవేశిస్తాయని వివరించింది. రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు జూన్ 7 లేదా 8న ప్రవేశించవచ్చని పేర్కొన్నది. రుతుపవనాలు పురోగమిస్తుండటంతో జూన్ 2 వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది.
సోమవారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నదని వెల్లడించింది. రోహిణి కార్తె ప్రభావం రాష్ట్రంలో బలంగా కనపడుతున్నది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొడుతున్నాయి.. సాయంత్రం చల్లబడి వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో వారం పాటు ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలపైన నమోదయ్యే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణం కేంద్రం తెలిపింది. ఆదివారం 29 జిల్లాల్లో 40 డిగ్రీలపైన పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహబూబ్నగర్, హైదరాబాద్, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో 39 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా నల్లగొండ జిల్లా నిడమనూర్ 44.1డిగ్రీలు, దామరచర్ల 44.0 డిగ్రీలు, ఖమ్మం జిల్లా పమ్మి 43.9 డిగ్రీలు, మధిర 43.8 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా జైనథ్ 43.7 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా బాగా పెరిగాయి. దాంతో ఉక్క పోస్తున్నది. రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు 23 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. అత్యంత తక్కువగా సంగారెడ్డి జిల్లా నల్లపల్లి 23.5 డిగ్రీలు, హైదరాబాద్ షేక్పేటలో 25.37 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.