హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్, విజయవాడ, గుంతకల్ డివిజన్లలోని అధిక సెక్షన్లలో సోమవారం నుంచి రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల గరిష్ఠ వేగంతో ప్రయాణిస్తాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
సికింద్రాబాద్ డివిజన్లోని సికింద్రాబాద్- కాజీపేట-బల్హర్షా, కాజీపేట్-కొండపల్లి, విజయవాడ డివిజన్లోని కొండపల్లి- విజయవాడ-గూడూరు, గుంతకల్ డివిజన్లోని రేణిగుంట- గుంతకల్- వాడి సెక్షన్లలో రైళ్లు గంటకు 130 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటాయి. ఈ సెక్షన్లలో గరిష్ఠ వేగం పెంపు అనుమతులు వచ్చిన ఫలితంగా ప్యాసింజర్ రైళ్లతోపాటు సరుకు రవాణా గూడ్స్ రైళ్ల సగటు వేగం కూడా పెరుగుతుంది. ఇందుకు కృషి చేసిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు, సిబ్బందిని జనరల్ మేనేజర్ (ఇన్చార్జి) అరుణ్కుమార్ జైన్ ప్రత్యేకంగా అభినందించారు.