2 BHK House | భిక్కనూరు, ఫిబ్రవరి 2: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం బస్వాపూర్లో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను కొందరు ఆక్రమించారు. రాత్రికి రాత్రే వచ్చి ఇండ్లను స్వాధీనం చేసుకున్నారు. బస్వాపూర్, సిద్దరామేశ్వనగర్ గ్రామాలకు చెందిన లబ్ధిదారుల కోసం 44వ జాతీయ రహదారికి ఆనుకొని 50 డబుల్ బెడ్రూం ఇండ్లను కేసీఆర్ హయాంలో నిర్మించారు. లబ్ధిదారులకు కేటాయించే విషయంలో కొద్దిగా ఆలస్యమైంది.
ఈ క్రమంలో బస్వాపూర్ గ్రామానికి చెందిన కొందరు గురువారం రాత్రి 9 గంటల సమయంలో డబుల్ బెడ్రూం ఇండ్లలోకి అక్రమంగా ప్రవేశించారు. అధికారులు వేసిన తాళాలు పగులగొట్టి, ఇండ్లను ఆక్రమించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ శివప్రసాద్, ఇతర అధికారులు శుక్రవారం ఉదయం అక్కడికి చేరుకుని గ్రామస్థులతో మాట్లాడారు. ఆక్రమించుకున్న ఇండ్లను తిరిగి స్వాధీనం చేసుకుని తాళాలు వేయించారు. ఇండ్లు కేటాయించక ముందే ఇలా ఆక్రమించుకోవడం సరికాదని, మరోసారి ఇలా చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. త్వరలోనే లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్లు కేటాయిస్తామని, అప్పటివరకు వేచి ఉండాలని సూచించారు.