సీఎం కేసీఆర్కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ విజ్ఞప్తి
హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ): పోడు భూముల సమస్యను యుద్ధప్రాతిపదికన పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి కోరారు. దీనిపై అన్ని పార్టీలతో సమావేశమై అభిప్రాయాలు సేకరించాలని విజ్ఞప్తిచేశారు. పోడుభూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. మంగళవారం హైదరాబాద్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో చాడ వెంకట్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దళితబంధు తరహాలో గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ అందించాలని కోరారు. సమావేశంలో సీపీఐ నాయకులు బాలమల్లేశ్, కలకొండ కాంతయ్య, రమావత్ అంజయ్యనాయక్, కలవేని శంకర్ పాల్గొన్నారు.