హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): ప్రజాపాలనలో బీసీల భాగస్వామ్యం లేకుండా సామాజికన్యాయం ఎలా సాధ్యమవుతుందని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిని పలువురు బీసీ మేధావులు ప్రశ్నిస్తున్నారు. బాగ్లింగంపల్లిలోని బీసీ రాజ్యాధికార సమితి ప్రధాన కార్యాలయంలో బీసీ నాయకులు, ఉద్యమకారులు, ప్రజాసంఘాల నాయకులు, మేధావులు, నిరుద్యోగులు బుధవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పదవుల్లో బీసీలకు దక్కాల్సిన వాటాపై, ప్రస్తుతం దక్కిన వాటాపై సమీక్షించారు. ఈ సందర్భంగా బీసీ రాజ్యాధికార అధ్యక్షుడు సురేశ్, పలువురు బీసీ మేధావులు మాట్లాడుతూ.. ప్రభుత్వ పాలనలో తామూ భాగస్వాములమేనని ముక్తకంఠంతో నినదించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు ప్రభుత్వం 17 కార్పొరేషన్లు ఏర్పాటు చేయడాన్ని స్వాగతిస్తూనే.. ప్రజాసంఘాల నాయకులకు పాలనలో అవకాశాలు కల్పించకపోవడాన్ని విమర్శించారు.
రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తుండగా తెలంగాణలో పదవులన్నీ రెడ్డి సామాజికవర్గానికే పరిమితమవుతున్నాయని, సీఎం రేవంత్రెడ్డి ఈ విషయాలను పరిగణలోకి తీసుకుని బీసీల ఎదుగుదలకు సహకరించాలని కోరారు. సమావేశంలో బీసీ రాజ్యాధికార సమితి గౌరవాధ్యక్షుడు ఆనందం, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేషనల్ కన్వీనర్ గుజ్జ కృష్ణ, మహిళా కన్వీనర్ ఊర్మిళ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు స్వామి, నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు వెంకటేశ్, బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక సభ్యురాలు కృష్ణలత, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షురాలు పద్మావతి, ప్రధాన కార్యదర్శి స్వప్న, మీడియా సెక్రటరీ లక్ష్మణ్, పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ తులసీ శ్రీమన్, బీసీ నాయకులు ప్రొఫెసర్ ప్రభంజన్యాదవ్, మధుసూదన్, సుధాకర్, ఏపీ కన్వీనర్ కాలసముద్రం సుధాకర్, కొమురయ్య, రాష్ట్ర కార్యదర్శి నాగభూషణం పాల్గొన్నారు.