ప్రిలిమ్స్ నుంచి మెయిన్కు దేశంలోనే ఎక్కువమందిని తెలంగాణలో ఎంపిక చేస్తున్నాం. ఒక్కో పోస్టుకు 50 మందిని పికప్ చేశాం. మిగిలిన రాష్ర్టాల్లో 20 శాతానికి మించడం లేదు. గ్రూప్1లో నోటిఫికేషన్ నుంచి మెయిన్కు అభ్యర్థులను ఎంపిక చేసే వరకు పారదర్శకత పాటించాం.
– బీ జనార్దన్ రెడ్డి, టీఎస్పీఎస్సీ చైర్మన్
హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ) :గ్రూప్-1 ఉద్యోగాల భర్తీలో టీఎస్పీఎస్సీ తొలిసారిగా సామాజిక న్యాయాన్ని పాటించింది. రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్ల వారీగా 50 మందిని మెయిన్కు సెలెక్ట్ చేసింది. 503 ఉద్యోగాలకు గాను ఒక్కో పోస్టుకు 50 మందిని మెయిన్కు పంపగా, అందులో సామాజిక వర్గాల వారీగా అభ్యర్థులను ఎంపిక చేసింది. గతంలో 503 ఉద్యోగాలు ఉంటే టాప్ 25,150 మందిని సెలెక్ట్ చేసేవాళ్లు. (ఈ లెక్క ప్రకారం 503 ఉద్యోగాలకు ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున ఎంపిక చేస్తే 25,150 మంది మెయిన్ పరీక్షకు అర్హత సాధించాలి. కానీ, మల్టీజోన్ 2లో మహిళల క్యాటగిరీలో దృష్టిలోపం, జనరల్ క్యాటగిరీలో వినికిడిలోపం ఉన్న అభ్యర్థులు తకువగా ఉన్నారు. ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని మెయిన్ పరీక్షకు 25,050 మందిని మాత్రమే ఎంపిక చేసింది.) దీనివల్ల కొన్ని సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్థులు టాప్ 25,150లో లేకపోయినా, లేదా తక్కువ మంది పోటీలో ఉండి మెయిన్లో క్వాలిఫై కాకపోయినా, ఆ ఉద్యోగాలు ఖాళీగా ఉంచాల్సి వచ్చేది. అందుకే ఈ సారి కొత్త సంస్కరణకు టీఎస్పీఎస్సీ శ్రీకారం చుట్టింది. ఎస్సీ కేటగిరీకి రిజర్వేషన్ల ప్రకారం 10 ఉద్యోగాలు ఉంటే, మెయిన్కు ఆ సామాజిక వర్గం నుంచి 500 మందిని సెలక్ట్ చేశారు. ఎస్టీ క్యాటగిరీకి 15 ఉద్యోగాలు ఉంటే, ఆ సామాజిక వర్గం నుంచి 750 మందిని మెయిన్కు ఎంపిక చేశారు. ఈ విధంగా అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం పాటించారు. దీనివల్ల సామాజిక న్యాయంతోపాటు 503 ఉద్యోగాలు మొత్తం భర్తీ చేయాలని టీఎస్పీఎస్సీ భావిస్తున్నది.
జంబ్లింగ్తో మాస్ కాపీయింగ్కు చెక్
గతంలో గ్రూప్-1 పరీక్షకు ఏ,బీ,సీ,డీ సిరీస్ల పేరుతో నాలుగు ప్రశ్నపత్రాలు మాత్రమే అభ్యర్థులకు వరుస క్రమంలో ఇచ్చేవారు. దీనివల్ల ఆ పరీక్ష హాల్లో ఎవరైనా మాస్ కాపీయింగ్కు పాల్పడే అవకాశం ఉండేది. దేశంలోనే తొలిసారిగా మాస్కాపీయింగ్కు చెక్ పెట్టేందకు టీఎస్పీఎస్సీ నాలుగు మించి అనేక సిరీస్ ప్రశ్నపత్రాలు ఇస్తున్నది. ఎంపిక చేసిన ప్రశ్నలకు కంప్యూటర్ సాఫ్ట్వేర్తో సాధ్యమైనన్ని దఫాలుగా జంబ్లింగ్ చేసి, ఎకువ సంఖ్యలో సిరీస్ల ప్రశ్నపత్రాలను ముద్రించింది. దీనివల్ల ఇద్దరు అభ్యర్థులు పక్కపక్కనే కూర్చున్నా, ముందు వెనుక కూర్చున్నా మాస్ కాపీయింగ్కు అవకాశం లేదు. ఎందుకంటే, 150 ప్రశ్నలను జంబ్లింగ్ చేసి ఇచ్చారు. ఒక అభ్యర్థికి ఒకటో ప్రశ్న వస్తే, పక్కనే ఉన్న అభ్యర్థికి అది 10 లేదా 20వ ప్రశ్నగా రావొచ్చు. అదేవిధంగా, ఒక ప్రశ్నకు నాలుకు మల్టిపుల్ చాయిస్లు ఉంటే, అవి కూడా వేర్వేరుగా వస్తాయి. దీనితో టీఎస్పీఎస్సీ పూర్తిగా మాస్ కాపీయింగ్కు చెక్ పెట్టగలిగింది. మిగిలిన రాష్ర్టాల్లోని కమిషన్లు సైతం ఈ విధానాన్ని అమలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి.
కటాఫ్ లేదు
గ్రూప్-1లో కటాఫ్ మార్కులు ఉండబోవని, కేవలం ఎంపిక జాబితా మాత్రమే ప్రకటిస్తామని టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లోనే తెలిపిం ది. దేశంలోనే అత్యున్నత నియామక సంస్థ అయిన యూపీఎస్సీ సైతం ప్రిలిమ్స్లో కటాఫ్ మార్కులను వెల్లడించదు. అభ్యర్థులకు వచ్చిన మార్కుల వివరాలను సైతం బహిర్గతం చేయ దు. కేవలం మెయిన్ పికప్ లిస్టును మాత్రమే ప్రకటిస్తుంది. అభ్యర్థుల్లో మానసిక ైస్థెర్యాన్ని పెంపొందించడం కోసం ఈ విధానాన్ని అవలంబిస్తుంది. ఉదాహరణకు, గ్రూప్-1లో ప్రిలిమ్స్ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. అందులో రాముకు 100 మార్కులు వచ్చాయి. రాజేశ్కు 75 మార్కులు మాత్రమే వచ్చాయి అనుకుందాం. ఇద్దరూ మెయిన్కు సెలక్ట్ అయ్యారు. అప్పుడు వంద మార్కులు వచ్చిన రామును చూసి రాజేశ్ ఆత్మైస్థెర్యాన్ని కోల్పోయే అవకాశముంది. అందుకే యూపీఎస్సీ ప్రిలిమ్స్లో కటా ఫ్ మార్కులు కానీ, అభ్యర్థులకు వచ్చిన మార్కు లు కానీ ప్రకటించదు. టీఎస్పీఎస్సీ సైతం గ్రూప్-1లో ఇదే విధానాన్ని అవలంబించింది.
మెయిన్కు తెలంగాణలోనే ఎక్కువమంది ఎంపిక
ప్రిలిమ్స్ నుంచి మెయిన్కు దేశంలోనే ఎక్కువమందిని తెలంగాణలో ఎంపిక చేస్తున్నాం. ఒక్కో పోస్టుకు 50 మందిని పికప్ చేశాం. మిగిలిన రాష్ర్టాల్లో 20 శాతానికి మించడం లేదు. దేశంలో సివిల్స్ తర్వాత రాష్ట్రంలో అత్యున్నత స్థాయి ఉద్యోగం గ్రూప్-1. అందుకే, ప్రతి విషయాన్ని ఒకటికి రెండుసార్లు క్షుణ్ణంగా పరిశీలించాం. పేపర్ కఠినంగా వచ్చిందనే భావన కొంతమందిలో ఉన్నది. అయితే కటాఫ్ మార్కులు లేవు కాబట్టి కఠినంగా ఉన్నా, సులభంగా ఉన్నా ఇబ్బందేం లేదు. ప్రశ్నపత్రం సులభంగా ఉంటే 150కి 120 రావచ్చు, కఠినంగా ఉంటే 100 రావచ్చు. అంతమాత్రాన అభ్యర్థులకు నష్టమేమీ లేదు. కటాఫ్ మార్కులు ఉండవని, 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను మెయిన్కు ఎంపిక చేస్తామని నోటిఫికేషన్లోనే చెప్పాం. మాస్ కాపీయింగ్కు అవకాశం ఉండకూడదనే జంబ్లింగ్లో కొత్త విధానం తీసుకొచ్చాం. గ్రూప్-1లో అభ్యర్థుల కోసం కొత్త సంస్కరణలు తీసుకొచ్చాం.
– బీ జనార్దన్ రెడ్డి, టీఎస్పీఎస్సీ చైర్మన్