COVID | హైదరాబాద్లోని నీలోఫర్ ఆసుపత్రిలో మరో కరోనా కేసు నమోదైంది. ఆరు నెలల చిన్నారికి కరోనా పాజిటివ్గా తేలింది. దీంతో నీలోఫర్లో నమోదైన కరోనా కేసుల సంఖ్య మూడుకు పెరిగింది. అయితే, పిల్లల ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి తెలిపారు. ఇదిలా ఉండగా.. ఇటీవల 14 నెలల చిన్నారికి కరోనా సోకిన విషయం తెలిసిందే.
ఆగాపుర ప్రాంతానికి చెందిన చిన్నారికి వైరస్ సోకింది. చిన్నారి 4-5 రోజుల కింద తీవ్ర జ్వరం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతుండగా తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకువచ్చారు. అనుమానం వచ్చి కరోనా టెస్టులు చేయగా.. వైరస్ పాజిటివ్గా తేలింది. ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 12 పాజిటివ్ కేసులు రికార్డయినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది.