Paper leak | హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏవో) ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసిన కేసులో అరెస్టయిన ఖమ్మంకు చెందిన సాయిలౌకిక్, సుష్మిత దంపతుల మూడు రోజుల కస్టడీ ఆదివారంతో ముగిసింది. తమ ఆడికారు అమ్మి, అడ్వాన్స్గా వచ్చిన రూ.6 లక్షలను ప్రవీణ్కుమార్కు పంపించామని, మిగతా రూ.4 లక్షలు పరీక్ష అనంతరం ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నామని సిట్ విచారణలో సుష్మిత దంపతులు వెల్లడించారు. సుష్మిత గ్రూప్-1 పరీక్ష రాసింది. ఓఎమ్మార్ షీట్లో బబ్లింగ్లో చేసిన పొరపాటుతో ఆమె పేపర్ తిరస్కరణకు గురైంది. ఈ విషయంపై టీఎస్పీఎస్సీ కార్యాలయానికి రావడంతో అక్కడ సెక్రటరీ పీఏ ప్రవీణ్కుమార్ పరిచయమయ్యాడు.
డీఏవో ప్రశ్నపత్రం తమ వద్ద ఉన్నదని చెప్పడంతో సుష్మిత, ఈ విషయాన్ని తన భర్త లౌకిక్తో చర్చించి పేపర్ కొనుగోలుకు సిద్ధపడింది. అప్పటికప్పుడు లౌకిక్ వద్ద డబ్బులు లేకపోవడంతో తమ రెండు కార్లలో ఆడి కారును స్నేహితుడికి విక్రయించి అడ్వాన్స్గా రూ.6 లక్షలు తీసుకొని ప్రవీణ్కు పంపించాడు. ఫిబ్రవరి 23 ఖమ్మం నుంచి సుష్మిత దంపతులు హైదరాబాద్కు వచ్చి ఎల్బీనగర్లోని డీ మార్ట్ వద్ద ప్రవీణ్ను కలిశారు. అక్కడే ప్రవీణ్ ప్రశ్నపత్రాన్ని సుష్మితకు అందజేశాడు. ఆ రోజు అల్కాపురిలోని ఒక లాడ్జీలో బసచేసిన సుష్మిత దంపతులు.. మరుసటి రోజు ఖమ్మం వెళ్లిపోయారు.
ఖమ్మంలో తమ ఇంట్లో కాకుండా బంధువుల ఇంట్లో రెండు రోజులపాటు సుష్మిత పరీక్షకు సిద్ధమైంది. 26వ తేదీన పరీక్ష రాసింది. శనివారం ఖమ్మం రాపర్తినగర్లోని వారి ఇంట్లో సోదాలు చేయగా ప్రవీణ్ వద్ద నుంచి తీసుకున్న మాస్టర్ ప్రశ్నపత్రంలోపాటు హాల్టికెట్ను కూడా సిట్ స్వాధీనం చేసుకున్నది. ఈ ప్రశ్నపత్రం తాము ఎవరికీ ఇవ్వలేదని వెల్లడించారు. నిందితులు చెప్పిన విషయాలు, దర్యాప్తులో పోలీసులు సేకరించిన సమాచారాన్ని విశ్లేషించిన సిట్.. డీఏవో పేపర్ సుష్మిత నుంచి ఇతరులకు వెళ్లలేదని ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. వీరి కస్టడీ పూర్తి కావడంతో సోమవారం కోర్టులో హాజరు పర్చనున్నారు.
నేను కష్టపడి చదివా..
సిట్కు న్యూజిలాండ్ నుంచి నిందితుడు ప్రశాంత్ ఈ మెయిల్
ప్రధాన నిందితుల్లో ఒకడైన రాజశేఖర్రెడ్డి, న్యూజిలాండ్లో ఉన్న తన బావ ప్రశాంత్రెడ్డికి గ్రూప్-1 ప్రశ్నపత్రాన్ని పంపించాడు. న్యూజిలాండ్లో పరీక్షకు సిద్ధమై, హైదరాబాద్కు వచ్చి ప్రశాంత్ గ్రూప్-1 పరీక్ష రాసి వెళ్లాడు. పేపర్ లీకేజీ కేసులో వందకుపైగా మార్కులు వచ్చిన వారిని ఆరా తీస్తున్న క్రమంలో ప్రశాంత్ విషయం వెలుగులోకి వచ్చింది. విచారణలో తన బావకు ప్రశ్నపత్రాన్ని పంపించానని రాజశేఖర్రెడ్డి వెల్లడించాడు. ఈ మేరకు న్యూజిలాండ్లో ఉన్న ప్రశాంత్కు వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా సిట్ నోటీసులు పంపించింది. ఈ నేపథ్యంలో ప్రశాంత్రెడ్డి సిట్కు ఈ మెయిల్ పంపించాడు. తాను కష్టపడి చదివానని, ఎవరి వద్ద నుంచి ప్రశ్నపత్రం తీసుకోలేదని, మార్కులు ఎక్కువగా రావడంతో అపోహ పడుతున్నారని మెయిల్లో పేర్కొన్నాడు. షమీమ్ కంప్యూటర్ను ఎనీడెస్క్ యాప్ ద్వారా న్యూజిలాండ్ నుంచి యాక్సెస్ చేసిన ప్రశాంత్.. దానిని డౌన్లోడ్ చేసుకొని, పరీక్షకు సిద్ధమైనట్టు సిట్ విచారణలో వెల్లడైన విషయం తెలిసిందే.