హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): టెన్త్ పేపర్ లీక్ వ్యవహారంలో బండి సంజయ్ కుట్ర బయటపడిన నేపథ్యంలో టీఎస్పీఎస్సీ ప్రశ్నప్రతాల లీకేజీలోనూ ఆయన పాత్రపై అనుమానాలు తలెత్తుతున్నాయి. టీఎస్పీఎస్పీ పేపర్ లీకేజీలో రెండో ప్రధాన నిందితుడు, సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్రెడ్డి బీజేపీ కార్యకర్త, సోషల్మీడియాలో చురుకైన పాత్ర పోషించాడు. ఇతడి ద్వారా బండి సంజయ్ ఏమైనా కుట్రలు చేశారా? అనేది నిగ్గుతేల్చేందుకు సిట్ రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది.
గతంలో గ్రూప్-1 పేపర్ లీకేజీపై బండి పలు ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలపై ఆధారాలు, సమాచారం ఇవ్వాలని రెండు సార్లు సిట్ నోటీసులు జారీ చేసింది. కానీ, బండి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. తన లీగల్ టీమ్ ద్వారా లేఖను మాత్రమే పంపించారు. బండి సంజయ్ ఫోన్ను వరంగల్ పోలీసులకు ఇవ్వకపోవడంతో, అందులో ఎన్నో కుట్రలు బయటపడే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు. అందులో పదో తరగతి కుట్రతో పాటు టీఎస్పీఎస్సీ కుట్రల వివరాలు కూడా వెలుగులోకి రావచ్చని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే మరోసారి నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడం, లేదా వరంగల్ పోలీసులు కస్టడీలోకి తీసుకుంటే అక్కడకు వెళ్లి విచారించే అవకాశాలున్నట్టు తెలుస్తున్నది.
సిట్ కస్టడీలో ఉన్న ఏఈ పేపర్ లీకేజీ నిందితులు ప్రశాంత్రెడ్డి, రాజేంద్రకుమార్, కాంట్రాక్టర్ తిరుపతయ్యను రెండో రోజు పోలీసులు విచారించారు. డబ్బు ఎక్కడి నుంచి తెచ్చారు, పొలాలు తాకట్టు పెట్టి డబ్బు సమకూర్చినట్టు నిందితులు వెల్లడించడంతో, ఆ విషయాన్ని సిట్ నిర్ధారించుకుంటున్నది.