TSPSC | హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పరీక్షలన్నీ యథాతథంగా నిర్వహిస్తామని కమిషన్ చైర్మన్ బీ జనార్దన్రెడ్డి తెలిపారు. షెడ్యూల్ ప్రకారమే మే 5న గ్రూప్-1తోపాటు ఇతర పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఇకపై జరుగబోయే అన్ని పరీక్షలకు కొత్త ప్రశ్నపత్రాలు సిద్ధంచేస్తామని చెప్పారు. పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారంపై మంగళవారం టీఎస్పీఎస్సీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పేపర్ లీకేజీపై అనవసరపు వదంతులు నమ్మొద్దని ఉద్యోగార్థులకు విజ్ఞప్తి చేశారు. టీఎస్పీఎస్సీ నిర్వహించిన పరీక్షలపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం జరుగుతున్నదని, దీనివల్ల అభ్యర్థులు గందరగోళంలో పడే ప్రమాదమున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో సుమారు 30 లక్షల మంది వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) చేసుకొన్నారని జనార్దన్రెడ్డి గుర్తు చేశారు. గతంలో ఒక పరీక్షకు దరఖాస్తు చేయాలంటే ఎన్నో ఇబ్బందులు ఉండేవని, ఇప్పుడు వాటన్నింటినీ సరళతరం చేశామని తెలిపారు. ఒక్కసారి టీఎస్పీఎస్సీలో ఓటీఆర్ చేసుకొంటే భవిష్యత్తులో ఏ ఉద్యోగానికైనా సులభంగా దరఖాస్తు చేయవచ్చని, మళ్లీమళ్లీ వివరాలేవీ నమోదు చేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఓటీఆర్ విధానాన్ని యూజీసీ సైతం మెచ్చుకొన్నదని తెలిపారు. ఏపీపీఎస్సీ ఉన్నప్పుడు కమిషన్ ద్వారా సగటున ఏడాదికి 3 నుంచి 4 వేల ఉద్యోగాలు భర్తీ చేసేవారని, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనతికాలంలోనే 35 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు సుమారు 23 వేల ఉద్యోగాలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని, అందులో 17,136 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చామని చెప్పారు. ఈ పరీక్షలన్నీ కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
టీఎస్పీఎస్సీలో కంప్యూటర్లు హ్యాక్ అయ్యాయని ముందుగా తామే పోలీసులకు ఫిర్యాదు చేశామని జనార్దన్రెడ్డి తెలిపారు. ప్రతి విషయంలో పారదర్శకతను కోరుకొంటున్నామని, అందుకే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశామని చెప్పారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే 12న జరగాల్సిన టీపీబీవో పరీక్షను, 15, 16వ తేదీల్లో నిర్వహించాల్సిన వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను వాయిదా వేశామని తెలిపారు. ‘రాజశేఖర్రెడ్డి అనే నెట్వర్ ఎక్స్పర్ట్ దాదాపు ఆరేడేండ్ల నుంచి ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా టీఎస్పీఎస్సీలో పనిచేస్తున్నాడు. అతనికి కార్యాలయంలోని కంప్యూటర్లకు చెందిన అన్ని ఐపీ అడ్రస్లు తెలిసే అవకాశం ఉన్నది. అతనికి ఉన్న పరిజ్ఞానంతో కీలక సమాచారం తస్కరించినట్టు భావిస్తున్నాం. ఆ సమాచారాన్ని అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రవీణ్ దుర్వినియోగం చేసి ఈ కేసులో నిందితులైన రేణుకకు ప్రశ్నపత్రాలు చేరవేశాడు. పోలీసుల దర్యాప్తులో 9 మంది నిందితులుగా తేలారు. ప్రవీణ్ రూ.10 లక్షలకు పేపర్లు అమ్ముకొన్నట్టు తెలిసింది. ఏఈ పరీక్ష పేపర్ల లీక్పై న్యాయ సలహా తీసుకొని పరీక్ష రద్దు చేయాలా? వద్దా? అనే దానిపై నిర్ణయం తీసుకొంటాం’ అని వివరించారు. టీఎస్పీఎస్సీలో నమ్మినవాళ్లే గొంతు కోశారని ఆవేదన వ్యక్తంచేశారు. నిందితులు అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష పేపర్ను మాత్రమే హ్యాక్ చేసినప్పటికీ, ముందుస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా టీపీబీవో, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను వాయిదా వేశామని చెప్పారు. ఏప్రిల్ 4వ తేదీన హార్టికల్చర్ ఆఫీసర్ పరీక్ష ఉన్నదని, అప్పటి నుంచి ఆ తర్వాత నిర్వహించే పరీక్షలన్నీ యథావిధిగా షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని స్పష్టంచేశారు.
టీఎస్పీఎస్సీ పరీక్షల నిర్వహణలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిందని జనార్దన్రెడ్డి తెలిపారు. ప్రతి పరీక్షను పారదర్శకంగా నిర్వహించామని, దేశంలోనే తొలిసారిగా మల్టీపుల్ జంబ్లింగ్ విధానాన్ని అమలు చేశామని గుర్తుచేశారు. ప్రశ్నలు, ఐచ్ఛికాలన్నింటినీ మల్టీపుల్ జంబ్లింగ్ చేయటంతో మాస్ కాపీయింగ్కు, ఎలక్ట్రానిక్ డివైజ్ తదితర మార్గాల్లో కాపీ కొట్టడానికి ఎటువంటి అవకాశం లేదని పేర్కొన్నారు. గతంలో గ్రూప్-1 పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయడానికి మూడేండ్లు పట్టేదని, తొలిసారి ఏడాదిలోనే పూర్తిచేయాలని భావించామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో అక్రమాలు జరగొద్దనే ఉద్దేశంతో అన్ని జాగ్రత్తలు తీసుకొన్నామని తెలిపారు. అనతికాలంలోనే 26 నోటిఫికేషన్లు ఇచ్చామని, 7 నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు పూర్తయ్యాయని తెలిపారు.
పేపర్ హ్యాక్ విషయంలో సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని జనార్దన్రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ‘సుమారు మూడు దశాబ్దాలు ప్రభుత్వ ఉద్యోగిగా సేవలందించిన నేను ఎటువంటి వ్యక్తినో అందరికీ తెలుసు. నిజమేదో, అబద్ధమేదో నిర్ధారించుకోకుండా ఇష్టానుసారం తప్పుడు ప్రచారం చేయడం నన్ను బాధించింది. నా పిల్లలు విదేశాల్లో ఉంటున్నారు. ఇక్కడ ఎవరూ ఉండటం లేదు. నా పిల్లలు ఎవరూ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రాయలేదు. వదంతులకు కూడా ఒక హద్దు ఉంటుంది. ఆ పరిస్థితే వస్తే పదవికైనా రాజీనామా చేస్తానే తప్ప రాజీ పడను’ అని స్పష్టంచేశారు. గ్రూప్-1 ప్రిలిమ్స్లో ఒక అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయనేది అతనికి మాత్రమే తెలుస్తుందని, మూడోకంటికి కూడా తెలిసే అవకాశం లేదని తెలిపారు. ‘నిందితుడు ప్రవీణ్కు గ్రూప్-1 ప్రిలిమ్స్లో 103 మార్కులు వచ్చాయని అంటున్నారు. అయితే అతడు ఓఎంఆర్పై రాంగ్ బబ్లింగ్ చేయటంతో అతని పేపర్ను పరిగణనలోకి తీసుకోలేదు. అయినా, ప్రిలిమ్స్లో 103 మార్కులే అత్యధికం కాదు’ అని పేర్కొన్నారు. తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరగాలనే సదుద్దేశంతోనే గ్రూప్-1 మెయిన్స్కు ఎక్కువ మందిని సెలక్ట్ చేశామని, దేశంలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు ఎక్కువ మందిని సెలక్ట్ చేసేది తెలంగాణలో మాత్రమేనని తెలిపారు. యూపీఎస్సీలో 1 : 30 రేషియోలో మాత్రమే తీసుకొంటారని వెల్లడించారు. టీఎస్పీఎస్సీ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను బరింత బలోపేతం చేస్తామని, ఆ దిశగా ఇప్పటికే చర్యలు ప్రారంభించామని తెలిపారు. అతి తక్కువ మందితో టీఎస్పీఎస్సీ పనిచేస్తున్నదని, భవిష్యత్తులో పని విధానం ఎలా ఉండాలనే విషయమై ఇప్పటికే ఒక ప్రణాళిక సిద్ధం చేశామని పేర్కొన్నారు. ఉద్యోగార్థులు అసత్య ఆరోపణలు నమ్మకుండా ప్రిపరేషన్ను కొనసాగించాలని కోరారు. ఎవరికి ఎప్పుడు ఎటువంటి సందేహాలు కలిగినా కమిషన్ను ఆశ్రయించాలని సూచించారు. మీడియా సమావేశంలో టీఎస్పీఎస్సీ కమిషన్ సభ్యులు కారం రవీందర్రెడ్డి, సుమిత్రానంద్ తనోబా, ధన్సింగ్, బీ లింగారెడ్డి, అరుణకుమారి, ఆర్ సత్యనారాయణ, కమిషన్ కార్యదర్శి అనితా రామచంద్రన్, అదనపు కార్యదర్శి సుమతి పాల్గొన్నారు.