హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): డీలిమిటేషన్ ముసుగులో దక్షిణాది రాష్ర్టాల ఆధిపత్యం తగ్గించి, ఉత్తర భారతానికి అధిక ప్రాధాన్యత కల్పించే కుట్ర జరుగుతున్నదని శాసనమండలిలో బీఆర్ఎస్పక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మండిపడ్డారు. ఇక్క డి రాష్ర్టాల ప్రమేయం లేకుండా ఎన్నికల్లో గెలువచ్చనే ఉద్దేశంతోనే దక్షిణాదికి మోసం చేసే ప్రయత్నం జరుగుతున్నదని ఆరోపించారు. ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద గురువారం తలపెట్టిన ‘బీసీ ఉమెన్ పోరు దీక్ష’లో మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్, పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ ఫ్లోర్లీడర్ వద్దిరాజు రవిచంద్రతో కలిసి ఆయన పాల్గొన్నారు.
దక్షిణాది రాష్ర్టాలకు ప్రస్తుతం పార్లమెంట్లో 25శాతం ప్రాతినిధ్యం ఉన్నదని, 2011 జనాభా లెక్కల ప్రకారమే నియోజకవర్గాలను పునర్విభజిస్తే ఇక్కడ 19శాతం ప్రాతినిధ్యం తగ్గే ప్రమాదమున్నదని సిరికొండ ఆగ్ర హం వ్యక్తంచేశారు. ప్రస్తుతమున్న 25శాతం మాదిరిగా డీలిమిటేషన్ చేస్తే ఎలాంటి సమస్య ఉండదని తెలిపారు. మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదని, వీటిలో రిజర్వేషన్లలో ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలని, అప్పుడే రాష్ట్రంలో, దేశంలో సమానత్వం ఉంటుందని చెప్పారు.
దక్షిణాది రాష్ర్టాల నుంచి అధిక ఆదాయం వస్తున్నా, బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం ప్రతిసారీ అన్యాయం జరుగుతున్నదని సిరికొండ దుయ్యబట్టారు. దక్షిణాది రాష్ర్టాలకు అన్యాయం జరిగితే కేంద్రంపై కొట్లాడాల్సి వస్తుందని, ఇలాగే కొనసాగితే భారతదేశం ఏదో ఒక రోజు దక్షిణ, ఉత్తర భాగాలుగా విడిపోయి ఉద్యమం వచ్చే ప్రమాదం ఉన్నదని మధుసూదనాచారి హెచ్చరించారు. గతంలో తెలంగాణ రాష్ర్టాన్ని చిన్నచూపు చూడటం వల్లే తెలంగాణ ఉద్యమం పుట్టుకొచ్చిందని గుర్తు చేశారు. దేశంలో ప్రశాంతత నెలకొల్పాలంటే అందరికీ సమాన అవకాశాలు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం పునరాలోచించుకోవాలని డిమాండ్ చేశారు.
మహిళా రిజర్వేషన్లలో ఓబీసీ మహిళలకు సబ్కోట కేటాయించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ర్టాలపై జరుగుతున్న కుట్రను శ్రీనివాసగౌడ్ ప్రశ్నించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ హనుమంతరావు, బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్గౌడ్, గుజ్జ కృష్ణ, కుల్కచర్ల శ్రీనివాసులు, విక్రమ్గౌడ్, మణిరంజని తదితరులు పాల్గొన్నారు.