హైదరాబాద్, జూలై 10 (నమస్తే తెలంగాణ): వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటమి తప్పదని తెలిసే.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీఆర్ఎస్పై నిందలు వేస్తూ ఉత్తరకుమార ప్రగల్భాలు పలుకుతున్నారని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. ఇటీవల నిర్వహించిన సర్వేలతోపాటు సీఎం నిర్వహించిన సర్వేలోనూ కాంగ్రెస్కు పరాజయం తప్పదనే విషయం వెల్లడైందని తెలిపారు. ఈ విషయం జగన్నాథపురం సభలో సీఎం చేసిన ప్రసంగంలో ప్రతిధ్వనించిందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆ సభలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో, నియోజకవర్గాల సంఖ్య ఎంతకు పెరుగుతుందో, రిజర్వేషన్ల పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదంటూనే మరోవైపు అసెంబ్లీ సీట్లు 185కు పెరుగుతాయని, కాంగ్రెస్ 117 సీట్లు గెలుస్తుందని చెప్పడం ఆయన ఫ్రస్టేషన్కు అద్ధంపడుతున్నదని విమర్శించారు.
ఖాళీ కుర్చీలను చూసి ప్రసంగించాల్సి రావడం రేవంత్రెడ్డి పాలనపై ప్రజావ్యతిరేకతను నిదర్శనం కాదా? అని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు జపం చేయకుండా ఏనాడైనా ప్రసంగాలు చేస్తున్నారా? అని నిలదీశారు. ఒకవైపు సాగునీరు అందక రైతులు పంటలు ఎండిపోతుంటే, రైతు ఆశీర్వాద సభల పేరిట ప్రజాధనాన్ని వృథా చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ‘ఎందుకోసం మీ ఆశీర్వాద సభలు.. రైతులను ఎరువుల కోసం క్యూలైన్లలో నిలబెడుతున్నందుకా? రుణమాఫీ పేరిట వంచించినందుకా? యూరియా కొరత తీర్చనందుకా? రైతుభరోసా ఎగ్గొట్టినందుకా?’ అని ప్రశ్నించారు. తెలంగాణ రైతులు కోరుకుంటున్నది ప్రగల్బాలు కాదని, .కేసీఆర్ పాలన తిరిగిరావాలని స్పష్టంచేశారు.