సిరిసిల్ల తెలంగాణ చౌక్, ఏప్రిల్ 26: జాతీయస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్కు రాజన్న సిరిసిల్ల జిల్లా విద్యార్థి ఎంపికయ్యారు. జిల్లాలోని గంభీరావుపేట మండలం కొత్తపల్లి ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న వైష్ణవి రూపొందించిన పరికరానికి చోటు దక్కిందని జిల్లా సైన్స్ అధికారి ఆంజనేయులు మంగళవారం తెలిపారు. బహుళ అంతస్తులకు అధిక బరువుగల వస్తువులను సులభంగా తీసుకెళ్లడానికి వైష్ణవి మూడు చక్రాల పరికరాన్ని తయారు చేసిందని పేర్కొన్నారు.
గ్యాస్సిలిండర్, వాటర్ బబుల్స్, రైస్ బ్యాగ్స్ వంటి బరువైన వస్తువులను పైఅంతస్తుల్లోకి తీసుకెళ్లడం చాలా శ్రమతో కూడిన పని. అయితే వైష్ణవి రూపొందించిన పరికరం ద్వారా సులువుగా చేర్చవచ్చు. పరికరానికి అమర్చిన మూడు చక్రాల ద్వారా తక్కువ బలప్రయోగంతో బరువులను సులభంగా అనుకున్న చోటుకు చేరవేయవచ్చు. అలాగే వయోవృద్ధులను కూడా మెట్ల మీదుగా ఈ యంత్రాన్ని వినియోగించి ఒకే వ్యక్తి సులువుగా తీసుకెళ్లవచ్చు. జాతీయస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్కు ఎంపికైన వైష్ణవిని సిరిసిల్ల డీఈవో రాధాకిషన్ అభినందించారు. రాష్ట్రస్థాయి ఎగ్జిబిషన్కు ప్రతి జిల్లాకు ఆరు చొప్పున మొత్తం 198 అర్హత సాధించాయి. ఇందులో 18 ప్రాజెక్టులు జాతీయస్థాయికి ఎంపికయ్యాయి.