రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన అర్షపల్లి శ్రీకాంత్ వస్త్ర పరిశ్రమపై ప్రచురించిన పుస్తకానికి విశేష ఆదరణ లభించింది. ఆయన కలం నుంచి వెలువడిన ‘సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ నాడు-నేడు’ అనే ఈ పుస్తకం ప్రజాదరణ పొందింది. పత్తి సాగు నుంచి రెడీమెడ్ దుస్తుల తయారీ వరకు సమగ్ర సమాచారాన్ని పుస్తక రూపంలో అందించారు. కార్మికుడి నుంచి ఆసామి, యజమాని వరకు పరిశ్రమ పుట్టు పూర్వోత్తరాలు అందరికీ తెలిసేలా రాశారు.
రాట్నం, చేనేత మగ్గం, మరమగ్గం, దారంతో తయారు చేసే వస్ర్తాల పూర్తి వివరాలు పుస్తకంలో పొందుపరిచారు. ఏడాది క్రితం ఈ పుస్తకాన్ని హైదరాబాద్లో చేనేత జాతీయ దినోత్సవం రోజున మంత్రి కేటీఆర్ ఆవిష్కరించి, ఆయన ప్రతిభను మెచ్చుకొన్నారు. తిరిగి జాతీయ చేనేత దినోత్సవం రోజైన ఆదివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆ పుస్తకాన్ని ప్రదర్శనకు పెట్టారు.