రాజన్న సిరిసిల్ల, జూలై 28 (నమస్తే తెలంగాణ): మన సిరిసిల్లకు జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది. ఇక్కడి కార్మిక క్షేత్రానికి తెలంగాణతోపాటు మరో 12 రాష్ర్టాల నుంచి జాతీయ జెండాల తయారీ ఆర్డర్ దక్కింది. ఆగస్టులో స్వాతంత్య్ర వజ్రోత్సవ ద్విసప్తాహంలో భాగంగా ప్రతి ఇంటిపై జెండా ఎగరేయాలనే పిలుపుమేరకు నేతన్నకు రాష్ట్ర సర్కారు రూ.5 కోట్ల విలువైన 1.20 కోట్ల పతాకాల ఆర్డర్లు ఇవ్వగా.. దేశంలోని 12 రాష్ర్టాల నుంచి మరో 2 కోట్ల జెండాల తయారీకి ఆర్డర్లు రావడం సిరిసిల్ల ఖ్యాతిని నలుదిశలా చాటింది. మొత్తంగా 5 వేల మరమగ్గాలపై త్రివర్ణ పతాకాలు తయారవుతుండగా, 2 వేల మందికి చేతినిండా పనిదొరుకుతున్నది.
కేసీఆర్, కేటీఆర్ ప్రత్యేక చొరవతో..
సిరిసిల్ల నేత కార్మికులకు చేతి నిండా పనికల్పించేందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ తీసుకొంటున్నారు. బతుకమ్మ, క్రిస్మస్, రంజాన్ వస్ర్తాల తయారీకి ఆర్డర్లు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు. ప్రస్తుతం 25 వేల మరమగ్గాలపై బతుకమ్మ చీరలు తయారవుతుండగా, తాజాగా రాష్ట్ర సర్కారు రూ.5 కోట్ల విలువైన 1.20 కోట్ల జెండాల తయారీకి ఆర్డర్ ఇచ్చి భరోసా కల్పించింది. ఇదే క్రమంలో దేశంలోని మరో 12 రాష్ర్టాల నుంచి 2 కోట్ల జెండాల తయారీ ఆర్డర్ దక్కగా, 5 వేల మరమగ్గాలపై జాతీయ జెండాలు తయారవుతున్నాయి. నేత కార్మికులే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి దొరుకుతున్నది. అందులో జెండాలు కటింగ్ చేసే వారితో పాటు కుట్టు పనిలో మహిళలు 600 మంది ఉపాధి పొందుతున్నారు. మరమగ్గాలపై ఒక్కో కార్మికుడు నెలకు రూ.20 వేల వరకు సంపాదిస్తున్నాడు.
జాతీయ స్థాయిలో సిరిసిల్ల కీర్తి..
రాష్ట్ర ప్రభుత్వం జెండాల తయారీ ఆర్డర్లను పోచంపల్లితోపాటు నల్లగొండ, వరంగల్, గద్వాల, నారాయణపేట, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు ఇచ్చింది. నేతన్నలు అధికంగా ఉండే సిరిసిల్లకు ఆర్డర్లు ఇవ్వాలని మంత్రి కేటీఆర్ సూచన మేరకు స్వయంగా సీఎం కేసీఆర్ టెస్కోను ఆదేశించారు. అయితే మరో 12 రాష్ర్టాలకు సంబంధించి జాతీయ జెండాల తయారీ ఆర్డర్లు కూడా సిరిసిల్లకే వచ్చినట్టు వ్యాపారులు చెప్తున్నారు. ఒక్కో స్క్రీన్ ప్రింటర్ వ్యాపారికి రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షల దాకా ఆర్డర్లు వచ్చినట్టు సమాచారం.
రాష్ట్ర సర్కారు కృషితోనే ఆర్డర్లు..
తెలంగాణ ప్రభుత్వం ఆర్డర్లు ఇవ్వడంతో దేశంలోని మిగతా 12 రాష్ర్టాల నుంచి మాకు ఆర్డర్లు వచ్చాయి. నేను 600 మందికి ఉపాధి కల్పిస్తున్నా. నేనొక్కడినే కాదు జిల్లా కేంద్రంలో 20 మంది స్క్రీన్ ప్రింటర్లు, 2 వేల మంది కార్మికులు వీటి తయారీలో రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. చేతినిండా పనిదొరకడం చాలా సంతోషంగా ఉన్నది.
– ద్యావనపల్లి మురళి, జెండాల తయారీదారు
200 మందికి ఉపాధి కల్పిస్తున్నా..
తెలంగాణ ప్రభుత్వం జెండాల తయారీ ఆర్డర్లు ఇవ్వడం వల్లే మిగిలిన రాష్ర్టాల నుంచి పెద్ద సంఖ్యలో ఆర్డర్లు వస్తున్నాయి. రూ.50 లక్షల విలువైన ఆర్డర్లు వచ్చాయి. 200 మందికి ఉపాధి కల్పిస్తున్నా. యువకులతోపాటు మహిళలకు చేతినిండా పనిదొరుకుతున్నది. 20 ఇంచుల ఎత్తు, 30 ఇంచుల నుంచి మీటరు పొడవు సైజు గల జెండాలు తయారు చేస్తున్నాం.
– ద్యావనపల్లి పండరి, జెండాల తయారీదారు
ఆర్డర్లన్నీ సిరిసిల్లకే వస్తున్నయ్..
మంత్రి కేటీఆర్ చొరవతో అన్ని వస్ర్తాల తయారీ ఆర్డర్లు ఇక్కడికే వస్తున్నాయి. బీడీలు బందుండటం వల్ల ఏ పనిలేక ఇబ్బంది పడుతున్న మాకు జెండాల పండుగొచ్చింది. చేతి నిండా పని కలిగింది. జాతీయ జెండాల తయారీతో దేశంలోనే సిరిసిల్లకు పేరు వస్తుందంటే అది రామన్న చలువే.
– కోట అనిత, సిరిసిల్ల