పుల్కల్ : తగ్గని వాన ఆగని వరద అన్నట్లుగా గత మూడు రోజులుగా అల్పపీడన ద్రోణి ప్రభావంతో సంగారెడ్డి జిల్లా సింగూరు ప్రాజెక్టులోకి భారీ వర్షాల కారణంగా ఎప్పటికప్పుడు వరద తీవ్రత పెరుగుతూనే ఉంది. ఇలా చేరుతున్న నీరు 22 టీఎంసీలకు చేరువలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
గడిచిన 24 గంటల్లో సోమవారం సాయంత్రానికి ప్రాజెక్టులోకి 6192 క్యూసెక్కుల నీరు వరద రూపంలో వచ్చి చేరినట్లు ప్రాజెక్టు డిప్యూటీ ఈఈ నాగరాజు తెలిపారు. వరద తీవ్రత పెరిగిన దృష్ట్యా ప్రాజెక్టుపై సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు కూడా ఆయన తెలియజేశారు. వరద తీవ్రత ఇలాగే కొనసాగితే మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్టులో 22 టీఎంసీలు దాటే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయన్నారు.
ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రాజెక్టులో ప్రస్తుతం 20.422 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ఇన్ ప్లో 6192 క్యూసెక్కులు కొనసాగుతుండగా, అవుట్ ఫ్లో 400 క్యూసెక్కులుగా ఉన్నట్లు ప్రాజెక్టు డిప్యూటీ ఈఈ తెలియజేశారు.