హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ) : ఏదైనా క్రిమినల్ కేసులో సింగిల్ జడ్జి వెలువరించిన మధ్యంతర ఉత్తర్వులు లేదా తుది తీర్పుతో విభేదించి నప్పుడు దానిపై ద్విసభ్య ధర్మాసనం వద్ద అప్పీల్ చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టంచేసింది. క్రిమినల్ కేసులో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై నేరుగా సుప్రీంకో ర్టులోనే అప్పీల్ చేసుకోవాలని తెలిపింది. ఆపరేషన్ మొబిలైజేషన్ (ఓఎం) ఆఫ్ ఇండియా గ్రూప్పై నమోదైన క్రిమినల్ కేసు దర్యాప్తు నేపథ్యంలో దాఖలైన అప్పీల్ పిటిషన్కు విచారణార్హత లేదని తేల్చిచెప్పింది. క్రిమినల్ కేసుల్లో సింగిల్ జడ్జి జారీచేసిన ఉత్తర్వులను అదే హైకోర్టు డివిజన్బెంచ్లో సవాలు చేయడానికి రాజ్యాంగం అనుమతించదని తెలిపింది. ఈ మేరకు ఓఎం గ్రూప్ దాఖలు చేసిన అప్పీల్ను చీఫ్ జస్టిస్ అపరేశ్కుమార్సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్తో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా ఓఎం గ్రూప్ ఆఫ్ చారిటీస్ నిర్వాహకులు సంస్థ ఆస్తులను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని సికింద్రాబాద్కు చెందిన ఆల్బర్ట్ లాయేల్ హైకోర్టును ఆశ్రయించారు.
నిర్వాహకులు విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్సీఆర్ఏ) ఉల్లంఘనతోపాటు అవినీతి నిరోధక చట్టం కింద నేరాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సింగిల్ జడ్జి, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఓఎం గ్రూప్ ఆస్తుల క్రయవిక్రయాలు చేపట్టరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఓఎం గ్రూప్ డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. అయితే ఐపీసీ సెక్షన్లు 409, 420, 477ఏ, ఎఫ్సీఆర్ఏ సెక్షన్ 37 కింద నమోదైన ఎఫ్ఐఆర్పై దర్యాప్తు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధమని న్యాయవాది వాదించారు. కొన్ని బ్యాంకు ఖాతాల జప్తుపై మాత్రమే సుప్రీంకోర్టు స్టే విధించిందని, స్థిరాస్తుల విక్రయాలపై ఎలాంటి ఆంక్షలు విధిం చలేదని పేరొన్నారు. అయినప్పటికీ క్రిమినల్ వ్యవహారాల్లో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై అదే హైకోర్టులో అప్పీల్ చేయలేమని, సుప్రీంకోర్టును మాత్రమే ఆశ్రయించాలని ధర్మాసనం స్పష్టం చేస్తూ అప్పీల్ ను కొట్టివేసింది.