Minister Komatireddy | సూర్యాపేట రూరల్, ఏప్రిల్ 7 : కరువు కారణంగా అప్పులపాలై రైతులెవరూ చనిపోలేదని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి స్పష్టం చేశారు. ఎండిన పంట లెక్కలు తీసి రైతులకు తగిన నష్టపరిహారం అందిస్తామని పేర్కొన్నారు. ఆదివారం ఆయన సూర్యాపేట జిల్లా కేంద్రం సమీపంలోని రాయిన్గూడెంలో మీడియాతో మాట్లాడారు.
నల్లగొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టు పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే రూ.50 వేల కోట్లతో మూసీ ప్రాజెక్టు ప్రక్షాళనకు సీఎం రేవంత్రెడ్డి శ్రీకారం చుట్టినట్టు తెలిపారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి పార్లమెంటు ఎన్నికల్లో తగిన బుద్ధిచెబుతామని హెచ్చరించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఎంపీ స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.