హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతున్నదని, ఆ ఎన్నికలు పెడితే కాంగ్రెస్ ఓటమి ఖాయమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లలో మూడుసార్లు రైతుభరోసా ఎగ్గొట్టిందని శుక్రవారం ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. పంటలకు పెట్టుబడి సాయం అందించడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తమ దయగా భావిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. వేల సంఖ్యలో క్లెయిమ్లు పెండింగ్లో ఉండటంతో రైతు కుటుంబాలు సాయం కోసం ఎదురు చూస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. రైతులకు కనీసం యూరియా కూడా అందించడం లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీద రైతులు ఆగ్రహంతో ఉన్నారని, ఈ నేపథ్యంలో సహకార ఎన్నికలు పెడితే ఓటమి ఖాయమనే భయంతోనే నామినేటెడ్ పదవుల వైపు మొగ్గు చూపుతున్నదని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్కు దమ్ముంటే వెంటనే ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ పాలనలో రైతులు రాజులా బతికారని, కాంగ్రెస్ పాలనలో ఆ రైతులు తమ వైభవం కోల్పోయారని నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. నాడు అడుగకుండానే రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత కరెంటు, 100% పంటల కొనుగోలు, సాగునీరు, రైతు వేదికలు నిర్మించి వ్యవసాయానికి ఇతోధికంగా కేసీఆర్ సాయం అందించారని గుర్తుచేశారు. రైతుల బంగారు భవిష్యత్తకు కేసీఆర్ పునాదులు వేస్తే, కాంగ్రెస్ రెండున్నరేండ్లలోనే వ్యవసాయ రంగాన్ని పూర్తిగా విచ్ఛిన్నం చేసిందని మండిపడ్డారు.