Singareni | హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమంలో వెన్నంటి నడిచిన సింగరేణి కార్మికులు.. సొంత రాష్ట్రం వచ్చిన తరువాత బీఆర్ఎస్కు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. సీఎం కేసీఆర్ మార్గదర్శనంలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, సింగరేణిని బలోపేతం చేసిన తీరుతో సంస్థ కార్మికులు బీఆర్ఎస్కు బాసటగా నిలుస్తున్నారు. సింగరేణి విస్తరించిన 10 నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ ఏకపక్ష ఆధిపత్యం కొనసాగిస్తున్నది. 40 వేలకుపైగా ఉన్న సింగరేణి కార్మికులు ప్రభుత్వానికి అండదండలు అందిస్తున్నట్టుగానే.. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కార్యక్రమాలను చేపట్టింది. ఏటికేడు సింగరేణి లాభాల్లో కార్మికులకు ఇస్తున్న వాటా పెంచుతుండటంతో వారిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
సీఎం కేసీఆర్ చేతుల్లోనే సింగరేణి క్షేమంగా ఉంటుందనే నమ్మకం కార్మిక వర్గాల్లో స్పష్టంగా కనిపిస్తున్నది. సింగరేణి విస్తరించిన పరిధిలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. సింగరేణి కార్పొరేట్ కార్యాలయం ఉన్న కొత్తగూడెం, ఇల్లందు, పినపాక, బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు, పెద్దపల్లి, రామగుండం, భూపాలపల్లి, మంథని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సింగరేణి కార్యకలాపాలు విస్తరించి ఉన్నాయి. దీంతో సహజంగానే ఇక్కడ కార్మికుల ప్రభావం గణనీయంగా ఉంటుంది. ఈ పది చోట్ల్ల ఎలాంటి ఎన్నికలైనా.. సింగరేణి కార్మికులు, వారి కుటుంబాలే కీలక పాత్రను పోషిస్తుంటాయి. ప్రస్తుతం ఒక్క మంథని మినహా 9 చోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. మంథనిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ సింగరేణికి ప్రత్యేకంగా చేసిందేమీ లేదనేది కార్మిక వర్గాల్లో ఉన్న అభిప్రాయం. దీంతో వచ్చే ఎన్నికల్లో మంథనిలోనూ కార్మికులు బీఆర్ఎస్ వెంటే ఉంటాయని చెప్తున్నారు.
సంక్షేమం.. అభివృద్ధి..
సింగరేణి సంస్థను సీఎం కేసీఆర్ ఊహించని విధంగా బలోపేతం చేశారు. తెలంగాణ రాకముందు రూ.12 వేల కోట్ల టర్నోవర్తో ఉన్న సింగరేణిని రూ.35 వేల కోట్లు దాటించి.. రూ. 50 వేల కోట్ల లక్ష్యంతో ముందుకు దూసుకుపోయేలా చేశారు. లాభాలు గతంలో రూ.420 కోట్లు ఉంటే, ఇప్పుడు రూ.2 వేల కోట్లకు పెరిగాయి. బొగ్గు ఉత్పత్తితోపాటు థర్మల్, సౌర విద్యుత్తు లాంటి వినూత్న కార్యకలాపాలు నిర్వహిస్తూ సంస్థ దూసుకుపోతున్నది. ఇటు నోటిఫికేషన్లు.. అటు కారుణ్య నియామకాలతో ఇప్పటికే సుమారు 15 వేలకుపైగా ఉద్యోగాలను భర్తీ చేశారు. బదిలీ వర్కర్లను జనరల్ మజ్దూర్లుగా రెగ్యులరైజ్ చేశారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన కార్మికునికి ఇచ్చే మ్యాచింగ్ గ్రాంట్ను గణనీయంగా పెంచారు. కార్మికుల ఇంటి నిర్మాణానికి 10 లక్షల రుణంపై వడ్డీ చెల్లించడం, కార్మికుల క్వార్టర్లకు ఏసీ సౌకర్యం, కరెంట్ బిల్లు రద్దు, ఐఐటీ, ఐఐఎం లాంటి ఉన్నత చదువులు చదివే కార్మికుల పిల్లలకు పూర్తి ఫీజుల చెల్లింపుతోపాటు తెలంగాణ ఇంక్రిమెంట్ను కూడా ఇస్తున్నారు.
వేతన బకాయిల చెల్లింపు
తాజాగా రూ.1,450 కోట్ల మొత్తం ఒకేరోజు సింగరేణిలోని 40 వేల కార్మికులకు చెల్లించారు. ఇది ఒక రికార్డు. ఒక్కో కార్మికునికి సగటున రూ.3.9 లక్షల వరకు వేతన బకాయిలను సింగరేణి చెల్లించింది. దసరా, దీపావళి బోనస్లను కూడా చెల్లించేందుకు ఏర్పాటు చేశారు. కేంద్రం ప్రైవేటీకరణ దిశగా ఒత్తడి తెస్తున్నా.. సీఎం కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నించి నిలువరిస్తున్నారు. ప్రభుత్వరంగ సంస్థగానే కొనసాగేలా పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో కార్మికుల్లో భరోసా ఏర్పడింది. అవసరమైతే సింగరేణిలో కేంద్రానికి ఉన్న వాటాను కూడా తామే కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ తెగేసి చెప్పడంతో.. తమ భవిష్యత్తు భద్రంగా ఉండాలంటే కేసీఆర్ను మించిన నాయకుడు లేడనే నమ్మకం కార్మికుల్లో పాతుకుపోయింది.
బీఆర్ఎస్ వెన్నంటే..
అభివృద్ధి, సంక్షేమ ఫలితాలను ఇప్పటికే అందుకుంటున్న సింగరేణి కార్మికులు ఎలాంటి ఎన్నికలైనా బీఆర్ఎస్కే జై కొడుతున్నారు. బీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఆధ్వర్యంలో సింగరేణి కార్మికులు ఏకత్రాటిపైకి వచ్చారు. ఎమ్మెల్సీ కవిత ఈ సంఘానికి గౌరవాధ్యక్షురాలిగా పనిచేయడం కూడా కార్మిక లోకానికి నమ్మకాన్ని పెంచింది. మిగతా రాజకీయ పార్టీలకు ఉన్న సంఘాలు.. వాటి బలం నామమాత్రంగానే కనపడుతున్నది. ఈ నేపథ్యంలో వచ్చే సాధారణ ఎన్నికలైనా.. ఇతర ఎన్నికలైనా తమ సంక్షేమాన్ని, సంస్థ అభివృద్ధిని పట్టించుకునే సీఎం కేసీఆర్కు.. ఆయన పార్టీ బీఆర్ఎస్కే తమ మద్దతు ఉంటుందని సింగరేణి కార్మికులు కుండబద్దలు కొడుతున్నారు.