హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటుపరం చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకొంటామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీలు మాలో తు కవిత, వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, గండ్ర వెంకటరమణారెడ్డి, దుర్గం చిన్నయ్య, నడిపెల్లి దివాకర్రావు, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి తదితర నాయకులు సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టారని గుర్తుచేశారు. కరోనా సంక్షోభంలోనూ సింగరేణి కార్మికులకు 29 శాతం లాభాల వాటా చెల్లించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తుచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కార్మికుల శ్రేయస్సుకే ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని చెప్పారు. రాష్ట్రంలో సింగరేణికి చెందిన 4 బొగ్గు బ్లాకులను వేలం వేయడాన్ని టీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టంచేశారు. టీఆర్ఎస్ పార్టీ కార్మికుల పక్షాన నిలబడుతుందని, బీజేపీకి వ్యతిరేకంగా పోరాడి సంస్థను రక్షించుకొంటామని తెలిపారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) వరింగ్ ప్రెసిడెంట్గా కెంగర్ల మల్లయ్యను నియమించారు. ఈ మేరకు ఎమ్మెల్సీ కవిత ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. తెలంగాణ ఉద్యమంలో టీబీజీకేఎస్ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. బొగ్గు గనుల్లో ప్రమాదవశాత్తు మరణించిన సింగరేణి ఉద్యోగులు, కార్మికులకు నివాళి అర్పించారు.