హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించకుండా తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా ముందుకు సాగుతున్నది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన సూచనలతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిశీలనకు వెళ్లిన సింగరేణి డైరెక్టర్ల బృందం బుధవారం కూడా ఫ్యాక్టరీని పరిశీలించింది. ఫ్యాక్టరీ డీఎండీతోపాటు ఉన్నతాధికారులతో సమావేశమైంది.
విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి మూలధనం సమకూర్చడం, ముడి సరుకుల సరఫరా, నిబంధనల మేరకు ఉక్కు ఉత్పత్తుల కొనుగోలుకు ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్-ఈవోఐ) బిడ్ సమర్పణకు ఈ నెల 15 చివరి తేదీ కావడంతో సాంకేతిక, ఆర్థిక, ఉక్కు ఫ్యాక్టరీ పరిస్థితిపై దృష్టి సారించిన సింగరేణి డైరెక్టర్ బలరాం నేతృత్వంలోని ముగ్గురు డైరెక్టర్లు, జీఎంల బృందం మంగళవారం ఫ్యాక్టరీని పరిశీలించింది.
బుధవారం ఉక్కు ఫ్యాక్టరీలోని ఒక్కో విభాగానికి వెళ్లి ఆ విభాగానికి సంబంధించిన సమాచారాన్ని బృందం సభ్యులు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీకి సంబంధించిన సాంకేతిక, ఆర్థిక, నిర్వహణ అంశాలతోపాటు ముడిసరుకుల అంశాలపై చర్చించినట్టు తెలుస్తున్నది. గురువారం సాయంత్రానికల్లా సింగరేణి డైరెక్టర్ల బృందం హైదరాబాద్కు చేరుకొని పూర్తి సమాచారంతో నివేదిక రూపొందించి సీఎం కార్యాలయానికి పంపిస్తారు. నివేదికను లోతుగా పరిశీలించిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం బిడ్ దాఖలు చేస్తుందని సమాచారం.