హైదరాబాద్, అక్టోబర్10 (నమస్తే తెలంగాణ) : గతంలో తిరుపతి ట్రస్టు ఆస్థాన సంగీత విద్వాంసురాలు, దివంగత గాయని లతామంగేష్కర్(Singar Lata Mangeshkar )చివరి కోరికను ఆమె కుటుంబ సభ్యులు నెరవేర్చారు. టీటీడీకి ఆమె తరఫున కుటుంబ సభ్యులు రూ.10 లక్షల చెక్కును విరాళంగా అందజేశారు. దీంతో గాయని లతా మంగేష్కర్ చివరి కోరిక నెరవేరింది. ఆమె చనిపోయే ముందు తిరుమల శ్రీవారికి విరాళంగా ఇవ్వాలని చివరి కోరికగా భావించారు. దానిని ఆమె కుటుంబ సభ్యులు తాజాగా నెరవేర్చారు. లతా మంగేష్కర్ తరపున ఆమె కుటుంబం తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.10 లక్షల విరాళాన్ని అందజేసింది.
లతా మంగేష్కర్ తరపున రూ.10 లక్షలు విరాళంగా ఇవ్వనున్నట్లు ఆమె కుటుంబం టీటీడీకి రాసిన లేఖలో పేర్కొంది. అలాగే మంగేష్కర్ కుటుంబం తరఫున ఆలయానికి విరాళంగా ఇవ్వాలని కోరుతూ ఆమె సోదరి ఉషా మంగేష్కర్ ముంబైకి చెందిన టీటీడీ బోర్డు సభ్యుడు మిలింద్ కేశవ్ నర్వేకర్ను వ్యక్తిగతంగా కోరారు. దీంతో వారంతా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి సమక్షంలో విరాళం చెక్కును టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు.
లతా మంగేష్కర్ వేంకటేశ్వర స్వామికి పెద్ద భక్తురాలు. 2010లో ఆమె పాడిన సుమారు 10 తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తనలను టీటీడీ ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు రికార్డ్ చేసింది. తరువాత ‘అన్నమయ్య స్వర్ణలతర్చన’ పేరుతో ఆడియో సీడీలుగా టీటీడీ విడుదల చేసింది. లతా మంగేష్కర్ 2022 ఫిబ్రవరి 6న కన్నుమూశారు. 1989లో భారత ప్రభుత్వం ఆమెకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రదానం చేసింది. చివరి రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళం ఇవ్వాలని అనుకున్నారు. ఈ మేరకు ఆమె తన విల్లులో కూడా రాసుకున్నారు.