Hyderabad | హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రపంచవ్యాప్తంగా పేరొందిన కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. మంగళవారం సచివాలయంలో పలు కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఇటీవల లండన్, దుబాయి పర్యటనల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులను పరిశీలించారు. దుబాయిలోని పలు విదేశీ కంపెనీలు, డిజైన్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ సంస్థల ప్రతినిధులు, కన్సల్టెన్సీ నిపుణులతో సీఎం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తదుపరి సంప్రదింపుల్లో భాగంగా హైదరాబాద్ అర్బన్ డెవెలప్మెంట్ అథారిటీ, మూసీ డెవెలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు వివిధ కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు.
ఇందులో భాగంగా సింగపూర్కు చెందిన మెయిన్హార్డ్ట్( MEINHARDT) కంపెనీ ప్రతినిధులు సీఎంతో భేటీ అయ్యారు. వివిధ దేశాల్లో తాము చేపట్టిన ప్రాజెక్టు డిజైన్లతో పాటు హైదరాబాద్లోని మూసీ డెవెలప్మెంట్కు అనుసరించాల్సిన ప్రాజెక్టుల నమూనాలపై పవర్ పాయింట్ ప్రజంటెషన్ ఇచ్చారు. హైదరాబాద్ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా నమూనాలు రూపొందించాలని రేవంత్ రెడ్డి కంపెనీ ప్రతినిధులకు సూచించారు. ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు, సిటీ చుట్టూ రాబోయే రైలు మార్గాల విస్తరణతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ రూపురేఖలు మారిపోతాయని అన్నారు. వాటికి అనుగుణంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవెలప్మెంట్ నమూనాలు రూపొందించాలని సూచించారు. మెయిన్ హార్ట్డ్ గ్రూప్ సీఈవో ఒమర్ షహజాద్, సురేష్ చంద్ర తో పాటు ప్రతినిధి బృందం సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.