హైదరాబాద్/సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రెండో విడత దళితబంధులో 162 దళిత కుటుంబాలకు స్వచ్ఛ వాహనాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటి ద్వారా ఆయా కుటుంబాలకు శాశ్వత ఆదాయం లభించేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. వచ్చే నెల నుంచి రెండో విడత దళితబంధును ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న ప్రభుత్వం నియోజకవర్గానికి 1100 దళిత కుటంబాలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోటాలో మరో 200 కుటుంబాలు కలిపి మొత్తంగా 1.30 లక్షల కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది. దళితబంధు తొలివిడతలో 38,323 దళితకుటుంబాలకు రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందజేసింది. వారంతా యూనిట్లు ఏర్పాటు చేసుకోవడంతో విజయవంతంగా ఆర్థిక పురోగతి సాగిస్తున్నారు. ఈసారి మాత్రం ప్రయోగాత్మకంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల పరిధిలో 162 మందికి సిల్ట్ కార్టింగ్ వెహికల్స్ అందజేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రూ. 1.94 కోట్లు ఖర్చు చేయనున్నది.
గాంధీ జయంతి రోజున అంటే అక్టోబర్ 2న హుస్సేన్సాగర్ తీరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద వీటిని అందించనున్నారు. సాధారణంగా జలమండలి పరిధిలో మురుగు వ్యవస్థ నిర్వహణలో వాడే యంత్రాలు శాఖాపరంగా ఉండడంతో పాటు కొన్నింటిని అద్దె ప్రాతిపదికన తీసుకుంటారు. ఈ క్రమంలో దళితబంధు పథకం కింద లబ్ధిదారులకు ఆ వాహనాలు ఇప్పించి, వాటిని జలమండలిలో అద్దెకు ఉంచాలని నిర్ణయించారు. ఒకవైపు పథకం కింద ఆ దళిత కుటుంబానికి ఆర్థిక చేయూత లభించడంతోపాటు ఉపాధి కోసం వెతుక్కునే పని లేకుండా జలమండలి ద్వారా భరోసా కల్పించనున్నారు. ఈ ఆదర్శవంతమైన ప్రణాళికకు నాలుగు జిల్లాల పరిధిలోని ఎమ్మెల్యేలు, జలమండలి ఎండీ, ఇతర అధికారులు ప్రణాళిక రూపొందించడం విశేషం. ఈ వాహనాలను తీసుకోవడం వల్ల లబ్ధిదారుడు యజమానిగా ఉంటూ, మరోవైపు డ్రైవరుగా కూడా ఉపాధి పొందుతాడు. ప్రతి వాహనానికి ఇద్దరు మజ్దూర్లు కావాల్సి ఉన్నందున ఆ కుటుంబంలోని వారే ఇద్దరు కార్మికులుగా కూడా ఉపాధి పొందవచ్చు. ఈ రకంగా 162 దళిత కుటుంబాలు జలమండలి నుంచి ఏటా కోట్ల రూపాయల బిల్లులు అందుకోబోతున్నాయి.
సిల్ట్ కార్టింగ్ వాహనాల పంపిణీ ప్రక్రియను వచ్చే నెల 2న చేపట్టేందుకు అధికారులు నిర్ణయించారు. జలమండలి ఎండీ దానకిషోర్ రెండు రోజుల క్రితం ఏర్పాట్లను పర్యవేక్షించారు. దళితబంధు పథకంలో భాగంగా ఒక్కో యూనిట్ కింద రూ.10 లక్షల చొప్పున ఇవ్వనున్నందున రూ.16.20 కోట్లతో 162 మందికి ఈ వాహనాలను ఇవ్వనున్నారు. ఒక్కో వాహనం ఖరీదు రూ.9.50 లక్షలు కాగా రిజిస్ట్రేషన్, ఇతరత్రా ఖర్చుల కింద రూ.50వేల చొప్పున లబ్ధిదారులకు అందించనున్నట్టు తెలిసింది. 162 వాహనాలను అద్దెకు తీసుకోవడం ద్వారా వాటికి జరిగే చెల్లింపులు, లబ్ధిదారుడికి వచ్చే ఆదాయం, నిర్వహణ వ్యయం ఇలా అన్ని కోణాల్లో జలమండలి అధికారులు ప్రాజెక్టు వివరాలను రూపొందించారు. దాని ప్రకారం ఒక్కో వాహనానికి జలమండలి నెలకు రూ.1.20 లక్షలు చెల్లించనుంది. ఇందులో నిర్వహణ వ్యయం పోగా ఒక్కో దళిత కుటుంబానికి రూ.90వేలకు పైగా (ఆ కుటుంబంలోని వారే డ్రైవరు, కార్మికులుగా పని చేస్తే) ఆదాయం రానుంది. అంటే ఏడాదికి ఒక్కో కుటుంబ ఆదాయం సుమారు రూ.పది లక్షల పైమాటే!