‘వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు బిగించాలని కేంద్ర ప్రభుత్వం ఎక్కడా చెప్పలేదు. అవసరం లేదనే స్పష్టంగా చెప్పింది’.. ఇదీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి వల్లెవేసిన పచ్చి అబద్ధం. ఓవైపు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదివారం ససాక్ష్యంగా.. ఆధారాలతో.. కేంద్ర విద్యుత్తు మంత్రి తనకు రాసిన లేఖలోని అంశాలను బహిర్గత పరచి చెప్పిన తర్వాత కూడా తెంపరితనంతో చెప్పిన అబద్ధాలనే మళ్లీ చెప్పుకొచ్చారు.
సంజయ్ చెప్పినట్టు కేంద్రం వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు వద్దనే అంటే.. ఆంధ్రప్రదేశ్లో సిక్కోలు రైతుల మీద మీటర్ల పిడుగు ఎందుకు పడింది? పైలట్ ప్రాజెక్టు పేరుతో ఏపీలోని జగన్ సర్కారు శ్రీకాకుళంలో ఏకంగా పాతికవేల మీటర్లను ఎందుకు బిగించింది? మీటర్లు బిగించారు. డబ్బులు వసూలు చేయకున్నా.. బిల్లులు తీసి చేతిలో పెడుతున్నారు. ఒక్కోరైతుకు రూ.1500 నుంచి రూ.3000 వరకు వస్తున్నాయి. దీంతో సిక్కోలు రైతు విలవిల్లాడుతున్నాడు. కేంద్రం కరెంటు మీటర్లతో రైతుల ఆక్రోశంపై శ్రీకాకుళం నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి క్షేత్రస్థాయి విశ్లేషణ.
శ్రీకాకుళం నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి: ‘మోటర్లకు మీటర్లు వద్దన్నా బిగించారు. రీడింగ్ తీసి బిల్లులు చేతిలో పెడుతుంటే, ఎప్పుడు కట్టాల్సి వస్తుందోనని భయమేస్తున్నది. మీటర్లు బిగించినప్పుడు ఎందుకని ప్రశ్నిస్తే, బిల్లులు రావు అని చెప్పారు. ఇప్పుడేమో బిల్లులు జారీ చేస్తున్నారు. ఉచిత విద్యుత్తు ఎంతకాలం అందుతుందో అని ఆందోళన కలుగుతున్నది’ శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం రాజాపురం గ్రామానికి చెందిన రైతు భాస్కర్గౌడ్ ఆవేదన ఇది. ‘కరెంట్ మోటర్లకు వచ్చే బిల్లులు హడలెత్తిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో రోజుకు రూపాయి చొప్పున బిల్లు వేసేవారు. గడచిన ఐదు నెలల్లో 3 వేలకు పైగా వచ్చిన బిల్లు భయపెడుతున్నది’ శ్రీకాకుళం జిల్లాలోనే పాలకొండ మండలం ఓని గ్రామానికి చెందిన కనపాక ఉమామహేశ్వర్రావు ఆవేదన ఇది. వీరిద్దరేకాదు.. శ్రీకాకుళం జిల్లాలో ఏ రైతును కదిలించినా ఇదే ఆందోళన. ఇదే ఆక్రోశం. ఉచిత విద్యుత్తు అంటారు.. మీటర్లు పెడతారు. ఎందుకు పెడుతున్నారని అడిగితే జవాబివ్వరు. డబ్బులేం వసూలు చేయంలే అంటూ తేలిగ్గా చెప్తారు. కానీ.. నెల తిరగ్గానే రీడింగ్ తీస్తున్నారు. ఈ తంతు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్తు పథకానికి త్వరలోనే మంగళం పాడతారా అన్న అనుమానాలు రైతులకు కలుగుతున్నాయి. ఏపీ ఈపీడీసీఎల్ గణాంకాల ప్రకారం ఇప్పటికే శ్రీకాకుళం సర్కిల్ పరిధిలో 27,632 వ్యవసాయ మోటర్లకు మీటర్లు బిగించారు. అందువల్లే భవిష్యత్తులో విద్యుత్తు బిల్లుల మోత తప్పేలా లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కేంద్రం నిర్దేశించిన షరతుల అమలులో భాగంగా ఉచిత విద్యుత్తు అమలు కాదేమోనని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తమది రైతు ప్రభుత్వమని అవకాశం దొరికినప్పుడల్లా చెప్పుకొచ్చిన జగన్ ప్రభుత్వం ఇప్పుడు వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టి.. రైతు మెడకు ‘విద్యుత్తు ఉచ్చు’ బిగిస్తున్నది.
త్వరలోనే నూరు శాతం మీటర్ల అమరిక..
జిల్లాలో దాదాపు 27,632 ఉచిత విద్యుత్తు వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. వీటన్నిటికీ వ్యవసాయ విద్యుత్తు మీటర్ల అమరిక పనులు పూర్తయ్యాయి. రైతుకు ఎటువంటి భారం ఉండదని చెప్తూనే మరోవైపు మీటర్లను అమర్చడమేంటని ప్రశ్నిస్తున్నా, పట్టించుకోని ప్రభుత్వం మోటర్లకు మీటర్లను ఏర్పాటుచేసింది. ఇప్పటికిప్పుడు మీటర్ల ద్వారా ఎటువంటి బిల్లులు రైతు చెల్లించాల్సిన అవసరం లేకపోయినా భవిష్యత్తులో బిల్లుల షాక్ తప్పదనే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రైతుల పొలాల్లో వ్యవసాయ మోటార్లకు మీటర్లు అమర్చిన విద్యుత్తు శాఖ అధికారులు పరిశ్రమలు, వ్యాపార సంస్థలకు విధిస్తున్న యూనిట్ ధరతోనే నెలనెలా బిల్లులు జారీ చేస్తున్నారు. అవి రైతుల చేతికి ఇవ్వడం లేదు. ప్రస్తుతానికి మీటర్ల అమరిక, బిల్లుల జారీపై రైతు సంఘాల అభ్యర్థన మేరకు వెనక్కి తగ్గిన ప్రభుత్వం బిల్లులు జారీ చేస్తున్నప్పటికీ చెల్లించాలని ఒత్తిడి తేవడం లేదు. మీటర్లు పెట్టేందుకు వందల మంది రైతుల నుంచి అంగీకార పత్రాలు పొందామని, త్వరలోనే శ్రీకాకుళం జిల్లాలో వందశాతం మీటర్లు అమర్చే ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెప్తున్నారు.
ఇప్పటికైతే సబ్సిడీ.. ప్రభుత్వం కట్టకుంటే?
శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ కనెక్షన్లకు ప్రతి నెలా బిల్లులు తీస్తున్నారు. ఇలా ఒక్కో రైతుకు నెలకు తక్కువలో తక్కువ రూ.1500 తక్కువ కాకుండా బిల్లు వస్తున్నది. ప్రస్తుతానికి ప్రభుత్వమే సబ్సిడీ విడుదలచేసి బిల్లులు కడుతున్నది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జనవరి వరకు రూ.26.09 కోట్ల బిల్లులు చెల్లించింది. భవిష్యత్తులో ప్రభుత్వం చెల్లించలేకపోతే.. ఈ మొత్తాన్ని డిస్కంలు రైతుల నుంచి ముక్కుపిండి వసూలు చేస్తాయి.
ప్రకాశంలోనూ అమలు?
సిక్కోలు రైతులను ఆగంచేసిన ఏపీ సర్కారు.. ఇప్పుడు ప్రకాశం జిల్లా రైతుల మెడపైనా మీటర్ కత్తి పెట్టనున్నది. ఏపీ విద్యుత్తు శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి సొంత జిల్లా రైతుల ఉసురు తీసేందుకు సిద్ధమవుతున్నారు. వచ్చే నెల నుంచి ప్రకాశం జిల్లాలో మీటర్లను బిగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాలోని విద్యుత్తు కనెక్షన్ల వివరాలు సేకరిస్తున్నారని తెలుస్తున్నది.
అన్నదాతల ఉద్యమబాట
పైలట్ ప్రాజెక్టు కింద శ్రీకాకుళం జిల్లాలో వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై రైతుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతున్నట్టు నమస్తే తెలంగాణ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. జిల్లాలోని ఎచ్చెర్ల మండలం కేశవరావుపేటకు చెందిన పొందూరు చందర్రావు రెండెకరాలున్న సన్నకారు రైతు. తన వ్యవసాయ పంపుసెట్టుకు పెట్టిన మీటరుతో మొదటి నెలలోనే రూ.1,500 బిల్లు వచ్చినట్టు చెప్పారు. ఆ బిల్లును చూసిన వెంటనే తన భవిష్యత్తు అగమ్యగోచరంగా అనిపించినట్టు తెలిపారు. తనలాగానే చాలామంది రైతులు ఈ మీటర్లపై ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. ఈ విద్యుత్తు బిల్లులను చెల్లించవలసిన అవసరం లేదని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ తమ మెడపై కత్తి వేలాడుతున్నట్టు అనిపిస్తున్నదని ఆయన వ్యాఖ్యానించారు. ‘ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నందున బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదని అంటున్నారు. కానీ ఎవరికి తెలుసు? వంటగ్యాస్కు ఇస్తున్న సబ్సిడీని ఎత్తేసినట్టుగానే విద్యుత్తు సబ్సిడీని కూడా ఎత్తివేయరన్న నమ్మకం ఏమిటి?’ అని ఆయన ప్రశ్నించారు. అణు విద్యుత్తు ప్లాంట్లకు వ్యతిరేకంగా ఉద్యమించి ప్రభుత్వాలను గడగడలాడించిన సిక్కోలు రైతులు.. సంస్కరణల పేరుతో రైతులకు ఉరివేసేందుకు ప్రయత్నిస్తున్న కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వంపై.. బాయికాడ మీటర్లు పెడుతూ కేంద్రానికి ఉరితాళ్లను అందిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కారుపై సమరశంఖం పూరిస్తున్నారు. కరంటు సంస్కరణల పేరుతో రైతుల నెత్తిన భస్మాసుర హస్తం పెట్టేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఉవ్విళ్లూరుతున్నది. ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటున్న వ్యవసాయ రంగాన్ని బొంద పెట్టేందుకు ప్రయత్నిస్తున్నది. నిధుల ఆశ చూపెట్టి రాష్ర్టాలను ఈ పాపంలో భాగస్వాములను చేసి.. ప్రజాకోర్టులో దోషులుగా నిలిపేందుకు కుట్రలు పన్నుతున్నది. అయితే.. వ్యవసాయ బిల్లులను ఎలాగైతే వెనక్కి తీసుకొన్నదో.. విద్యుత్తు సంస్కరణలను కూడా అలాగే వెనక్కు తీసుకోవాలని శ్రీకాకుళం రైతులు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. పంజాబ్లో రైతులు మోదీని తమ రాష్ట్రానికి రానివ్వలేదని, రాబోయే రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో మోదీకి అదే పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరిస్తున్నారు. ఏపీ సీఎం జగన్ రైతు వ్యతిరేక చర్యలకు దిగడం దురదృష్టకరమని రైతుసంఘాల నేతలు చెప్తున్నారు.
తెలంగాణలో రైతులు సంతోషంగా ఉన్నరు.. ఏపీలో లేరు
తెలంగాణాలో రైతులు సంతోషంగా ఉన్నారు. ఏపీలో లేరు. రైతుల ప్రయోజనాలను ఏపీ సీఎం జగన్ పట్టించుకోవడంలేరు. ఆర్బీకే కేంద్రాల్లో ఎరువులు లేవు. పండించిన పంటను కొన్న తర్వాత కూడా మాకు డబ్బులు రాలేదు. ఇవన్నీ చాలవన్నట్టు పంపుసెట్లకు మీటర్లు పెడుతున్నారు. సంక్షేమాన్ని పట్టించుకోని జగన్ సర్కారు విద్యుత్తు మోటర్లకు మీటర్లు పెట్టే విషయంలో చాలా తొందరపడుతున్నది. ఆగమేఘాలపై మీటర్లు బిగించారు. ఇప్పుడు ప్రతి నెల బిల్లులు పంపుతున్నారు. మాతో కట్టిస్తున్నారు కూడా. మోదీ తెచ్చిన విద్యుత్తు సంస్కరణలను రైతుల పొట్ట కొట్టేందుకే అమలుచేస్తున్నారు. ఇప్పటికే అనేక కష్టాలతో ఉన్న రైతులకు ఇప్పుడు కరెంటు బిల్లులు కూడా భారంగా మారుతున్నాయి. తెలంగాణలో ఒక్క పైసా రైతుల నుంచి తీసుకోవడంలేదు. పైగా అక్కడ ఫుల్లు కరెంటు వస్తున్నది. శ్రీకాకుళం జిల్లాలో ఎప్పుడు కరెంటు వస్తుందో.. ఎప్పుడు పోతుందో తెలియదు. దీనికి కూడా మీటర్లు పెట్టడం జగన్ ప్రభుత్వానికే చెల్లింది.
–జల్లు చంద్రమౌళి, ఉర్లామ్ గ్రామం, నరసన్నపేట మండలం, శ్రీకాకుళం
గర్జిస్తున్న కేసీఆర్.. తలొగ్గిన జగన్
కేంద్రం నిబంధనలకు తలొగ్గితే.. ప్రతి బాయికాడ కరెంటు మీటర్ పెట్టి, నెలనెలా బిల్లులు తీసి, రైతుల ముక్కు పిండి వసూలుచేయాలి. కరెంటు సంస్కరణలు అమలుచేస్తున్న రాష్ర్టాలకు ఎఫ్ఆర్బీఎం పరిమితిని 0.5 శాతం పెంచుతామని కేంద్రం ఆఫర్ ఇచ్చింది. దీనిని ఐదేండ్లపాటు కొనసాగిస్తామని చెప్పింది. తెలంగాణ జీఎస్డీపీ దాదాపు రూ.10 లక్షల కోట్లు. ఆంధ్రప్రదేశ్ జీఎస్డీపీ కూడా దాదాపు అంతే. ఈ లెక్కన విద్యుత్తు సంస్కరణలు అమలుచేస్తే ఒక్కో రాష్ర్టానికి అదనంగా ఏటా రూ.5 వేల కోట్లు వస్తాయి. మొత్తంగా రూ.25 వేల కోట్లు తీసుకొనే అవకాశముంటుంది. కానీ రైతుల మీద ప్రేమ చూపడంలో సీఎం కేసీఆర్కు, వైఎస్ జగన్కు మధ్య హస్తిమశకాంతరమున్నది. ఏడేండ్ల కష్టం, ఎన్నో సంస్కరణల ఫలితంగా తెలంగాణ రైతులు ఇప్పుడిప్పుడే నాలుగు కాసులు కండ్ల జూస్తున్నారు. ఇలాంటి సమయంలో బాయికాడ మీటర్లు పెట్టి వారి నెత్తిన భస్మాసుర హస్తం పెట్టేది లేదని సీఎం కేసీఆర్ గర్జిస్తున్నారు. ఏపీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మాత్రం కేంద్రానికి పూర్తిగా తలొంచింది. ఏపీలో కరెంటు మీటర్లు బిగించడానికి 2020 సెప్టెంబర్ 3న మంత్రిమండలి నిర్ణయించింది. మెరుపు వేగంతో శ్రీకాకుళంలో ప్రతి వ్యవసాయ కనెక్షన్కు మీటర్ బిగించింది. మీటర్లు వద్దని రైతులు రెండు చేతులు జోడించి వేడుకొన్నా.. చివరికి కాళ్లు పట్టుకొన్నా కనికరించలేదు. బెదిరించి మరీ మీటర్లు బిగించింది. గతేడాది ఏప్రిల్ నుంచే బిల్లులు తీయడం మొదలు పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై రైతు సంఘాలు, ప్రతిపక్షపార్టీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. కేవలం అదనపు అప్పు తెచ్చుకొనే విషయంలో అర్హత సాధించేందుకే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తలొగ్గుతున్నదని మండిపడుతున్నాయి. ‘అప్పు చేసేందుకు అర్రులు చాస్తున్న ప్రభుత్వ చర్యలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. విద్యుత్తు సంస్కరణలను అమలు చేయడం ద్వారా లబ్ధి పొందాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. ఇది ప్రజలను మోసం చేయడమే’ అని ఏపీ రైతుసంఘం శ్రీకాకుళం జిల్లా నాయకుడు కోనారి మోహన్రావు విమర్శించారు.
చట్టాన్ని అడ్డుకుంటాం
విద్యుత్తు సంస్కరణల అమలు జరిగితే ఎఫ్ఆర్బీఎం పరిమితి మూడు శాతం నుంచి మూడున్నర శాతానికి పెరుగుతుంది. తద్వారా అదనంగా మరో రూ.5 వేల కోట్ల వరకు రుణాలు తెచ్చుకోవచ్చు. ఆ పేరుతో మీటర్లు పెట్టడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. ఏపీలోని 18 లక్షల వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టే ప్రయత్నాలను అడ్డుకొనేందుకు ఎంతకైనా తెగిస్తాం.
– బండారు సత్యానారాయణ మూర్తి, టీడీపీ నేత
డొంక తిరుగుడు విధానాలు
విద్యుత్తు చట్ట సవరణలను ఆమోదించుకొనేందుకు కేంద్రం డొంకతిరుగుడు విధానాలకు పాల్పడుతున్నది. వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు పెట్టే విషయమై రైతులపై ఒత్తిడి తెస్తున్నది. దీనిపై రైతుల్లో తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్నది.
-రాంబాబు, లోక్సత్తా నాయకుడు
రైతులకు అవగాహన కల్పిస్తాం
విద్యుత్తు చట్ట సవరణవల్ల ఎదురయ్యే ప్రమాదాల గురించి రైతులకు అవగాహన కల్పించాలని నిర్ణయించాం. రైతుల నుంచి విద్యుత్తు చార్జీల వసూలు ఆపేందుకు నిరంతర పోరాటం చేస్తాం.
– పంచాది నారాయణబాబు, రైతుసంఘం నేత, విశాఖ
మోదీ నిర్ణయం దారుణం
మోదీ సంస్కరణలు అని చెప్పిన వెంటనే ఏపీ సీఎం ఎగిరి గంతేసి శ్రీకాకుళం జిల్లాలోని 24 మండలాల్లో అమలుచేస్తున్నారు. పొరుగున తెలంగాణలో విద్యుత్తు మీటర్లు లేవు. స్వయంగా తెలంగాణ సీఎం కేసీఆర్.. ఖబడ్దార్ నరేంద్ర మోదీ.. నీ దిక్కున్న చోట చెప్పుకో, వ్యవసాయానికి కరెంటు మీటర్లు పెట్టే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పారు. కానీ, ఏపీలో భిన్నంగా ఉన్నది. కేంద్రం వద్ద జగన్ తలదించడం దారుణం. దేశానికి అన్నం పెడుతున్న రైతన్నలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ కూర్చోవడం జగన్కు మంచిది కాదు. ఏపీ సీఎం కూడా తెలంగాణ ముఖ్యమంత్రిలా పోరాడాలి. -టీ తిరుపతిరావు, సీఐటీయూ శ్రీకాకుళం జిల్లా కార్యవర్గ సభ్యులు,
ఉచితమన్నారు.. మీటర్లు పెడుతున్నారు
మీటర్లు బిగించడమన్నది ఉచిత విద్యుత్తు నుంచి మళ్లించడమే. డిస్కంలకు లాభాలు చేకూర్చడమే. దీన్ని వ్యతిరేకించాల్సిందే. గతంలో కాల్వలకు నీటిమీటర్లు పెడ్తామంటే ఉద్యమించడంతో వెనక్కు తగ్గారు. ఇప్పుడు కూడా పోరాటం చేయాల్సి వస్తుంది.
–కండపు ప్రసాద రావు, ఆదర్శరైతు, వెలగవాడ,
పాలకొండ మండలం, శ్రీకాకుళం జిల్లా
గతంలో ఎన్నడూ మీటర్లు లేవు…
గడచిన ప్రభుత్వంలో ఉచితంగా బోరులకు విద్యుత్తు అందించారు. గతంలో మీటర్లు లేవు. ఇప్పుడు పెట్టారు. ఉచితమైనప్పుడు మీటర్లు దేనికో ప్రభుత్వం చెప్పాలి. పక్కనున్న తెలంగాణలో మీటర్లు అమర్చేందుకు అక్కడి ప్రభుత్వం నిరాకరించింది. మన రాష్ట్రంలో ఆగమేఘాలపై మీటర్లు అమర్చారు. వ్యవసాయానికి విద్యుత్ కోతలు విధిస్తున్నారు.
– మండన ఉదయ్కుమార్, రైతు, నిమ్మతోర్లవాడ, ఆముదాలవలస మండలం