Harish Rao | సంగారెడ్డి : నర్సాపూర్ నియోజకవర్గం దౌల్తాబాద్లో నిర్వహించిన రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డిపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో గుంపు మేస్త్రి గూబ పగిలేలా తీర్పు ఇవ్వాలని హరీశ్రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కేవలం పదవుల కోసం, పార్టీల కోసం జరుగుతున్న ఎన్నికలు కాదు.. తెలంగాణ భవిష్యత్కు జరుగుతున్న ఎన్నికలు ఇవి అని హరీశ్రావు స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది. కానీ ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. 2 లక్షల రుణమాఫీ చెయ్యలేదు. రైతుబంధు ఊసే లేదు. కల్యాణ లక్ష్మి లేదు, తులం బంగారం లేదు. రూ. 4 వేల పెన్షన్లు లేవు. పంటకు బోనస్ లేనే లేదు అని హరీశ్రావు గుర్తు చేశారు.
మదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరాల్సి వచ్చింది..? రైతులను రేవంత్ రెడ్డి మోసం చేసినందుకు కాంగ్రెస్ పార్టీలో చేరావా..? అని నిలదీశారు. చెప్పుతో రైతులను కొడుతా అన్నందుకు మదన్ రెడ్డి కాంగ్రెస్లో చేరిండా..? కష్టకాలంలో కేసీఆర్ను వదిలిపెట్టడం న్యాయమా..? ఇద్దరం దోస్తులం అని చెబుతున్నాడు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే కేసీఆర్ను వదిలి వెళ్ళిండు అని హరీశ్రావు మండిపడ్డారు.
కేసీఆర్ ప్రజల తరుపున కాంగ్రెస్ హామీల గురించి నిలదీస్తే.. కేసీఆర్ నీ చెడ్డి ఊడగొడుతా అంటున్నాడు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి హోదాలో ఉండి అలా అంటారా..? పంట కొనుగోలు ఎందుకు చెయ్యడం లేదు. రైతుల జీవితాలతో ప్రభుత్వం ఎందుకు ఆడుకుంటున్నది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో కారును గెలిపించాలని కోరుతున్నా. గుంపు మేస్త్రి గూబ పగిలేలా తీర్పు ఇవ్వాలి. బాండ్ పేపర్ బౌన్స్ అయ్యింది. వారికి శిక్ష పడాల్సిందే. రేవంత్ రెడ్డి బీజేపీతో చేతులు కలిపాడు. రేవంత్ రెడ్డికి అహంకారం వచ్చింది అని హరీశ్రావు పేర్కొన్నారు.