సిద్దిపేట, ఆగస్టు 23(నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉచిత పథకాలు వద్దంటూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. మంగళవారం సిద్దిపేట జిల్లాలో మంత్రి పర్యటించారు. ముందుగా చిన్నకోడూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం సిద్దిపేటలో రూ.40 కోట్లతో నిర్మించే నర్సింగ్ కళాశాల భవనానికి, రూ.15 కోట్లతో నిర్మించే మోడల్ ఆటోనగర్కు శంకుస్థాపన చేశారు. తర్వాత పట్టణంలోని విపంచి కళానిలయంలో ఫీల్డ్ అసిస్టెంట్లతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో హరీశ్రావు మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం నల్లచట్టాలను తెస్తుంటే, టీఆర్ఎస్ సర్కారు ప్రజాసంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నదని చెప్పారు. ఉచితాలు వద్దంటూ.. బ్యాంకులను ముంచిన వారికి లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన ఘనత బీజేపీ సర్కారుకే చెల్లిందన్నారు.
మోటర్లకు మీటర్లు పెట్టాలని ఒత్తిడి
బీజేపీ, కాంగ్రెస్పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా రూ.2,016 పింఛన్ ఇవ్వడం లేదని మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. ఉచిత విద్యుత్తు ఇవ్వొద్దని, బాయిలకాడ మీటర్లు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ ఒత్తిడి తెస్తున్నదని మండిపడ్డారు. ధరలు పెంచెటోళ్లు ఎవరో? పేదల సంక్షేమాన్ని పట్టించుకునే వాళ్లు ఎవ రో? ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు. పెద్దపెద్ద కంపెనీలకు రుణాలు మాఫీ చేస్తూ, పేదలకు సంక్షేమ పథకాలు లేకుండా బీజేపీ కుట్ర చేస్తున్నదని ధ్వజమెత్తారు. 4 లక్షల మంది బీడీ కార్మికులకు పింఛన్ ఇస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ మాత్రమేనని స్పష్టంచేశారు. టీఆర్ఎస్ది రైతు వ్యతిరేక ప్రభుత్వమని వ్యాఖ్యానించిన అమిత్షా మాటలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. ధాన్యం కొనడంలో కేంద్రం కొర్రీలు పెడితే.. కేసీఆర్ మాత్రం రైతుల నుంచి పూర్తి ధాన్యం కొన్నారని గుర్తుచేశారు. రైతుబంధు, రైతుబీమా, సాగుకు ఉచిత కరెంట్ ఇస్తున్నది దేశంలో ఎవరో అందరికీ తెలుసన్నారు. రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ చేసినంతగా దేశంలో ఎవరూ చేయడం లేదని చెప్పారు.
ఉపాధి హామీకి కేంద్రం ఎసరు
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో అనేక ఆంక్షలు పెట్టి కూలీలను ఇబ్బందులకు గురిచేసేలా కొత్త జీవో తీసుకొచ్చిందని మంత్రి హరీశ్రావు విమర్శించారు. బడా వ్యాపారులపై ఉన్న ప్రేమ ఉపాధి కూలీల మీద కేంద్రానికి లేదన్నారు. ఉపాధి హామీలో రూ.10 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని సాక్షాత్తూ కేంద్ర మంత్రి చెప్పారని గుర్తుచేశారు. ఉపాధి పథకాన్ని దెబ్బతీసే కుట్ర కేంద్ర సర్కారు చేస్తున్నదని హరీశ్రావు విరుచుకుపడ్డారు.