హైదరాబాద్,మార్చి 29 (నమస్తే తెలంగాణ): ప్రజల్లో మంచి స్పందన ఉంది.. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ సీట్లు గెలువాలని పీసీసీ అధినేత, సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ గాంధీభవన్లో శుక్రవారం సాయంత్రం జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల వ్యూహం, ఏప్రిల్ 6న తుక్కుగూడలో జరుగునున్న కాంగ్రెస్ జన జాతర సభ ఏర్పాట్లపై పార్టీ నేతలకు రేవంత్రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఈ సభకు రాజీవ్గాంధీ ప్రాంగణంగా, జనజాతరగా నామకరణం చేశామని రేవంత్రెడ్డి చెప్పారు. ఇదే సభలో కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల జాతీయ మ్యానిఫెస్టోను విడుదల చేస్తామని, ఇందులో ప్రకటించబోయే ఐదు న్యాయ్ గ్యారెంటీలపై విస్తృత ప్రచారం చేస్తూ ప్రజలల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ మ్యానిఫెస్టోలో తెలంగాణ పెండింగ్ హామీలనూ చేరుస్తామని ప్రకటించారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటికే కొందరికి నామినేటెడ్ పదవులు ఇచ్చామని, పార్టీ అన్ని అనుబంధ సంఘాల చైర్మన్లకు పదవులు ఇచ్చామని గుర్తు చేశారు. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు, సలహాదారులు, నామినేటెడ్ పోస్టులు పొందిన నేతలను అభినందిస్తూ సమావేశం తీర్మానం చేసింది. మంత్రి శ్రీధర్బాబు నేతృత్వంలో మ్యానిఫెస్టో కమిటీకి సలహాలు, సూచనలు ఇవ్వాలని సీఎం రేవంత్రెడ్డి కోరారు. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జులను నియమించి ఎన్నికల ప్రచారం చేపట్టాలని సూచించారు. దేశంలో తెలంగాణ మాడల్ పాలన బాగుందని పార్టీ జాతీయ నాయకత్వం కితాబు ఇవ్వడం గర్వకారణమని, ఇది సమిష్టి కృషి వల్లనే సాధ్యమైందని తెలిపారు.
రంగారెడ్డి జిల్లా పరిధిలోని తుక్కుగూడలో ఏప్రిల్ 6న నిర్వహించే బహిరంగసభలో కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. హైదరాబాద్ గాంధీభవన్లో శుక్రవారం సాయంత్రం జరిగిన పీసీసీ కార్యవర్గ సమావేశంలో చర్చించిన విషయాలను మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీతో కలిసి కలిసి మీడియాకు వివరించారు. ఈ సమావేశంలో వందరోజుల ప్రభుత్వ పాలనపై చర్చించామని, అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలిచే వ్యూహంపై చర్చించామని భట్టి వివరించారు. తమ ప్రభుత్వం చేసిన పనులు, చేపట్టబోయే విషయాలను సభలో ప్రజలకు వివరిస్తామని తెలిపారు. తెలంగాణను ఒక మాడల్గా తీసుకువెళ్లాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని చెప్చారు. ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి తుక్కుగూడ సభ నాందిగా భావిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను దేశవ్యాప్తంగా ప్రశంసిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. తమ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని గుర్తించకపోగా, ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. పంట నష్టంపై నివేదిక రాగానే రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ఐదారు నెలలపాటు రైతుబంధు సాయం వేసేదని, తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే రైతుబంధు వేయడం లేదని విమర్శించడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లి పంటలను పరిశీలించినా తమకు కానీ, రైతులకు గానీ ఒరిగేదేమీ లేదని మంత్రి తుమ్మల విమర్శించారు.