అమీర్పేట, ఫిబ్రవరి 21: తెలుగును విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రస్తుత తెలుగు విశ్వవిద్యాలయాన్ని ప్రపంచ తెలుగు వర్సిటీగా అభివృద్ధి చేయాలని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావు సూచించారు. తద్వారా ప్రపంచ నలుమూలల్లో ఉంటున్న తెలుగువారు మాతృభాషలో డిప్లొమా, డిగ్రీలు చేసేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు. తెలుగు భాష పట్ల ఎంతో గౌరవభావం ఉన్న సీఎం కేసీఆర్ను ఈ విషయంలో అంతా కలిసి కోరితే తగిన చొరవ తీసుకొంటారని ఆశాభావం వ్యక్తంచేశారు. అక్షరయాన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బేగంపేటలోని హోటల్ ది ప్లాజాలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాసాగర్రావు మాట్లాడుతూ.. పిల్లలు మాతృభాషను 5 ఏండ్లపాటు కచ్చితంగా చదివేలా కేంద్రం విద్యావిధానాల్లో మార్పులు చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి సంపాదకుడు కే శ్రీనివాస్కు ‘పంపకవి’ పురస్కారాన్ని అందజేశారు. కే శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలుగు భాషకు ఇప్పటికిప్పుడు వచ్చిన ప్రమాదమేమీ లేదని చెప్పారు. యాహూ, మైక్రోసాఫ్ట్ కూడా తెలుగు తర్జుమాకు పెద్దపీట వేశాయని గుర్తుచేశారు. కార్యక్రమంలో తెలుగు వర్సిటీ వీసీ తంగెడ కిషన్రావు, విశ్రాంత ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా సాహితీ స్రష్టలు డాక్టర్ వడ్డెపల్లి కృష్ణ, డాక్టర్ యద్దనపూడి రెడ్డి శ్యామల, డాక్టర్ రాధా కుసుమ, డాక్టర్ సీ శశిబాలలతోపాటు పలువురు పురస్కారాలు అందుకొన్నారు. ఈ సందర్భంగా కృష్ణశాస్త్రి సాహిత్యం, రేపటి తరం సైంటిస్ట్, తిరుప్పావై కవితలు, వాణీ శతకం తదితర పుస్తకాల ఆవిష్కరించారు.
ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 21: ప్రజలందరి సమిష్టి కృషితోనే తల్లిభాషలను కాపాడుకోగలమని, ఇందుకు సమగ్ర తెలంగాణ నిఘంటువును తీసుకురావాలని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ అన్నారు. తెలంగాణ పౌరులందరూ నిత్య జీవితంలో వాడుతున్న పదాలను నిఘంటువు నిర్మాణానికి అందజేయాలని కోరారు. ఓయూ ఆర్ట్స్ కళాశాలలో తెలుగు విభాగం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంలో ఆయన మాట్లాడారు. విశ్వవిద్యాలయ పరిశోధనలన్నీ ఒకే గొడుగు కిందికి రావాల్సిన అవసరం ఉన్నదని,ఇందుకు తెలంగాణ సాహిత్య అకాడమీ సహాయ సహకారాలను అందజేస్తుందని అన్నారు.