హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా శైవక్షేత్రాలు శివరాత్రి శోభను సంతరించుకున్నాయి. ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామ స్మరణలతో ఆలయాలు మారుగోగుతున్నాయి. శివోహం అంటూ గరల కంఠుడిని స్మరించుకుంటున్నారు. శివరాత్రి పర్వదినం సందర్భంగా తెల్లవారుజాము నుంచి ఆలయాల వద్ద త్రినేత్రుడిని దర్శించుకోవడానికి పెద్దసంఖ్యలో భక్తులు బారులుతీరారు. ఆలయ ఆవరణలో దీపారాదన చేస్తున్నారు. ఆదియోగికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అభిశేక ప్రియుడైన ముక్కంటికి బిల్వపత్రాలు సమర్పించుకుంటున్నారు.
ఇక రాష్ట్రంలో ప్రసిద్ధ శైవ క్షేత్రమైన వేములవాడ రాజన్న ఆలయం, ఏడుపాయల వనదుర్గాభవానిమాత ఆలయం, మేడ్చల్ జిల్లాలోని కీసరగుట్ట, జోగులాంబ గద్వాల జిల్లాలోని జోగులాంబ ఆలయం, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర-ముక్తీశ్వర స్వామి, కోటగుళ్లు, ములుగు జిల్లాలోని రామప్ప, మహబూబాబాద్ జిల్లాలోని కురవి వీరభద్రస్వామి, హనుమకొండలోని వేయిస్తంభాల రుద్రేశ్వరాలయం, మెట్టుగుట్ట రామలింగేశ్వరస్వామి, జనగామ జిల్లాలోని పాలకుర్తి సోమేశ్వరస్వామి, వరంగల్లోని స్వయంభూ శంభులింగేశ్వరస్వామి, కాశీబుగ్గలోని కాశీవిశ్వేశ్వరాలయం, హైదరాబాద్లోని బంజారాహిల్స్, వనస్థలిపురం, ఓల్డ్సిటీలో శివాలయాల్లో భక్తులు బారులుతీరారు.
నల్లగొండ జిల్లా మేళ్లచెర్వులోని స్వయంభూ శంభులింగేశ్వరాలయం, నార్కట్పల్లి మండలం చెర్వుగట్టులోని పార్వతీ జడల రామలింగేశ్వరాలయం, దామచర్ల మండలంలోని వాడపల్లి శైవాలయం, నల్లగొండలోని పానగల్లు చాయా సోమేశ్వరాలయంలో శివరాత్రి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
వేములవాడ రాజన్న క్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో స్వామివారి దర్శనానికి 8 గంటల సమయం పడుతున్నది. గర్భాలయంలో జరిగే అభిషేక పూజలను అధికారులు రద్దు చేశారు. శని, ఆదివారాల్లో భక్తులందరికీ లఘు దర్శనం కల్పించనున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు తరలివస్తున్నారు. త్రివేణి సంగమ గోదావరిలో భక్తులు స్నానాలు ఆచరిస్తున్నారు.