హైదరాబాద్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): మహిళా సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా ఇప్పిస్తున్న వడ్డీరహిత రుణాలను మన స్వయం సహాయక సంఘాలు (ఎస్హెచ్జీలు) చక్కగా సద్వినియోగం చేసుకొంటున్నాయి. వాటిని సకాలంలో తిరిగి తీర్చడంలోనూ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని ఎస్హెచ్జీల నిరర్థక ఆస్తులు లేదా మొండి బకాయిలు (ఎన్పీఏ) చాలా తక్కువగా ఉన్నాయి. దేశ సగటు ఎన్పీఏ 1.82 శాతంగా ఉంటే.. తెలంగాణ ఎస్హెచ్జీల ఎన్పీఏ 1.66 శాతం మాత్రమే ఉన్నది.
వాస్తవానికి ఇది ఇంకా చాలా తక్కువగా ఉంటుందని, తెలంగాణ ఏర్పాటుకు ముందు తీసుకున్న రుణాలతోపాటు చనిపోయిన సభ్యుల పేరిట ఉన్న రుణాలను మినహాయిస్తే మన ఎస్హెచ్జీల ఎన్పీఏ 1 శాతంలోపే ఉంటుందని అధికారులు చెప్తున్నారు. దీనితో పోలిస్తే బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లోని ఎస్హెచ్జీల మొండి బకాయిలు చాలా అధికంగా ఉన్నాయి. ప్రధాని మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో అత్యధికంగా 4.59% ఎన్ఏపీ ఉన్నది. ఆ తర్వాతి స్థానాల్లో తమిళనాడు (4.52%), మహారాష్ట్రలో (4.43%), ఉత్తరాఖండ్ (3.85%), రాజస్థాన్ (3.77%), ఉత్తరప్రదేశ్ (3.28%) నిలిచాయి.
తెలంగాణలో మొత్తం 4.60 లక్షల ఎస్హెచ్జీలు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో వాటికి రూ.12 వేల కోట్లకుపైగా రుణాలు ఇప్పించిన రాష్ట్ర ప్రభుత్వం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.15 వేల కోట్ల రుణాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. వీటికయ్యే వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుండటంతో మన ఎస్హెచ్జీల సభ్యులు సజావుగా రుణాలను తీర్చగలుగుతున్నారు. బ్యాంకులు.. ఎలాంటి తనఖా లేకుండానే ఒక్కో సంఘానికి రూ.20 లక్షల వరకు అందిస్తున్నాయి.