దేవరకద్ర రూరల్, నవంబర్ 30: తెలంగాణ మహిళలు ఎవరూ షర్మిలలాగా బూతులు మాట్లాడరని ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ ఏర్పడిన ఏడేండ్ల్ల తర్వాత ఇప్పుడు పాదయాత్రతో ఇక్కడి ప్రజలను అయోమయానికి గురి చేసే కుట్ర జరుగుతున్నదని అనుమానం వ్యక్తంచేశారు. మహబూబ్నగర్ జిల్లాలో నూతనంగా ఏర్పడిన కౌకుంట్ల మండల కేంద్రంలో తాసిల్దార్, ఎంఈవో, వ్యవసాయ శాఖ కార్యాలయాలను బుధవారం ప్రారంభించిన అనంతరం మంత్రి మాట్లాడారు. మీ అభిమాన నాయకులు, మంత్రులపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఏపీ ప్రజలు ఊరుకుంటారా? ఏపీకి వెళ్లి జగన్ను ఇదే తీరుగా విమర్శిస్తే వారు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు.
షర్మిల ఇటీవల ఢిల్లీకి వెళ్లి బీజేపీ నేతలతో భేటీ అయ్యారని ఆరోపించారు. తాము వైఎస్పై ఏనాడూ వ్యక్తిగత విమర్శలు చేయలేదని, తెలంగాణలోని ఆయన విగ్రహాలు కూడా ధ్వంసం చేయలేదన్నారు. ఏపీలో తెలంగాణ వైతాళికుల విగ్రహాలున్నాయా? అని ప్రశ్నించారు. తెలంగాణకు సంబంధం లేని షర్మిల, ఇక్కడ పాదయాత్రల పేరిట అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ను తిడితే తెలంగాణ సమాజం ఎలా ఊరుకొంటుందని ప్రశ్నించారు. వైఎస్ కుటుంబానికి 2004లో బంజారాహిల్స్లో ఉన్న ఒక్కగానొక్క ఇంటిని ఎన్నికల కోసం అమ్మేసుకొన్నారని, ఇప్పుడు వారికి లక్షల కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.