హైదరాబాద్ సిటీబ్యూరో/షాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): పోక్సో కేసు నిందితుడు ఆరుగురుని హత్య చేసిన ఘటనలో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించారని స్థానికులు, బాధితుల బంధువులు మండిపడుతున్నారు. నిందితుడు ముందస్తు బెయిల్ పొందేందుకు కావాల్సిన సమయం ఇచ్చేందుకు పోలీసులు 2 లక్షల లంచం తీసుకున్నారని బహిరంగంగా ఆరోపిస్తున్నారు. పోక్సో కేసులో తక్కువ తీవ్రతతో ఏడేండ్లలోపు శిక్షలు పడే(78, 351(1) బీఆఎన్ఎస్, 11, రెడ్విత్ 12 పోక్సో యాక్ట్ 2012) సెక్షన్లతో కేసులు నమోదు చేయడాన్ని ఇందుకు ఉదాహరణగా చెప్తున్నారు.
కనీసం నిందితుడిని పోలీస్స్టేషన్కు పిలిపించి ఏం జరిగిందనే వి షయాన్ని కూడా ఆరా తీయలేదనే విమర్శలు వస్తున్నాయి. నిందితుడి నుంచి ప్రాణభయం ఉందంటూ బాధితులు పోలీసులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని, ఈ హత్యలకు పరోక్షంగా పోలీసులు కూడా బాధ్యులేనం టూ ఆరోపిస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ షాబాద్లో ప్రధాన రహదారిపై బాధిత బంధువులు, స్థానికులు ఆందోళనకు దిగారు.
పోక్సో కేసు నమోదైన తర్వాత పోలీసులు స్టేషన్ బెయిల్ ఇవ్వలేదని, నిందితుడిని కూడా పట్టుకోలేదని అంటున్నారు. పోక్సో కేసు నమోదైన తరువాత నిందితుడిని ఎందుకు పట్టుకోలేదని ఉన్నతాధికారులు ప్రశ్నించకపోవడంపై ప్రజలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు లంచంలో కొంత ఉన్నతాధికారులకు పంపించడంతోనే ఈ కేసులో నిందితుడికి సంబంధించిన విషయాన్ని అధికారులు పట్టించుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి.
బాధితురాలిని నిందితుడు ఏడాదిగా వేధిస్తున్నాడు. ఆమె ఇంటి పక్కనే ఉంటూ సీసీ కెమెరాలతో నిఘా పెట్టాడు. బాలిక ఏం చేస్తున్నది, ఎప్పుడు బయటకు వెళ్తున్నదనే విషయాలను గమనించేవాడు. మీ తండ్రిని చంపినట్టే నీ కుటుంబాన్ని హతమారుస్తానంటూ బెదిరించాడు. బాధితులు ఈ విషయం చెప్పినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు. కేసుతీవ్రతను గుర్తించి నిందితుడిని కనీసం మందలించాలనే ఆలోచన కూడా చేయలేదు. రాజ్కుమార్ బెయిల్ తీసుకొని గ్రామంలో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని బాధితులు పోలీసుల దగ్గరకు వెళ్లి భయాందోళన వ్యక్తం చేస్తే.. పోలీసులు వెటకారంగా నవ్వుతూ మాట్లాడారని, కేసును చాలా లైట్గా తీసుకున్నారనే విమర్శలున్నాయి.