మహబూబ్నగర్, జూలై 13(నమస్తే తెలంగాణ) : ‘రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్లకు నిధుల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఇప్పటికే వేసిన రోడ్లకే ఇంకా నిధులు విడుదల చేస్తలేరు. నా నియోజకవర్గంలో గడిచిన రెండున్నరేండ్లలో వేసిన రోడ్లకు రూ.153 కోట్లు ఇంకా విడుదల చేయలేదు. కాంట్రాక్టర్లు కొత్త పనులు చేసేందుకు సుముఖంగా లేరు’ అంటూ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఎదుట జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి రుసరుసలాడినట్టు తెలిసింది. మంత్రి శంకుస్థాపనల కార్యక్రమానికి కూడా ఎమ్మెల్యే హాజరుకాకుం డా షాక్ ఇచ్చారు. సోమవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు మంత్రి వెంకట్రెడ్డి హాజరయ్యారు. షెడ్యూల్ ప్రకారం జడ్చర్ల నియోజకవర్గంలోనూ మంత్రి కార్యక్రమం ఉండగా చివరి నిమిషంలో రద్దయ్యింది.
మక్తల్, వనపర్తి, గద్వాల కార్యక్రమాలు ఫైనల్ అయ్యాయి. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి మహబూబ్నగర్లో మంత్రికి స్వాగతం పలికే కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రితో ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసిన రో డ్లకు కూడా నిధులు మంజూరు చేయడంలేద ని, నిధులు ఇవ్వకుండా శంకుస్థాపన కార్యక్రమాలు ఎందుకని ప్రశ్నించినట్టు తెలిసింది. తన నియోజకవర్గంలో ‘హ్యామ్’ రోడ్లు చేపట్టేందుకు శంకుస్థాపన చేయవద్దని ఎమ్మెల్యే చెప్పడం వల్లే అక్కడ కార్యక్రమాలు రద్దు చేసుకొని వనపర్తి, గద్వాలలో మంత్రి ప్రోగ్రామ్లు పెట్టుకున్నట్టు సమాచారం. మహబూబ్నగర్లో మంత్రిని కలిసిన ఎమ్మెల్యే తర్వాత కార్యక్రమాల్లో పాల్గొనకుండానే వెళ్లిపోయారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డికి దగ్గరగా ఉండే, ఆయన వర్గం లో ఉండే ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి ఇప్పుడు మంత్రి జిల్లాకు వచ్చినా కార్యక్రమాల్లో పాల్గొనకుండా అసంతృప్తి వ్యక్తం చేయడం గమనార్హం.
ఆరు గ్యారెంటీలు ఎక్కడ వచ్చినయ్?
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలపై మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలకేంద్రంలో రూ.339.39 కోట్లతో చేపట్టే రోడ్ల నిర్మాణానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. శిలాఫలకం ఆవిష్కరించకముందు స్టేజీ మీద కళాకారులు ప్రభుత్వ పథకాలపై పాటలు పాడుతూ అమలు గురించి అడిగా రు. అక్కడే ఉన్న మహిళలు తమకు ఉచిత బస్సు తప్ప ఏ పథకం అమలుకావడం లేదని చెప్పారు. అమలు చేయని పథకాలు అమలైనట్టు పాడుతున్న పాటలు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దీంతో చేసేది లేక కళాకారులు పాటలు బంద్ చేశారు.