హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): ఎంటర్ప్రైజెస్ పథకం కింద మహిళా స్వయం సహాయక సంఘాలు తీసుకున్న బ్యాంకు రుణాలు 95 శాతానికి పైగా సద్వినియోగం అవుతున్నట్టు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) అధ్యయనంలో తేలింది. రుణాలను వ్యాపారాలకు వినియోగించుకోవడంతో కుటుంబ సభ్యులందరికీ చేతి నిండా పని దొరకడమే కాకుండా ఆర్థికంగా బలోపేతం అవుతున్నట్టు గుర్తించారు. బ్యాంకు రుణాలు ఎంతవరకు సద్వినియోగం అవుతున్నాయో తెలుసుకోవడానికి సెర్ప్ అధికారులు రెండు దఫాలుగా 2022 సెప్టెంబర్, 2023 జనవరిలో సర్వే నిర్వహించారు. ప్రతి జిల్లాలో 10 మంది చొప్పున 320 మందిని సర్వే చేశారు. సర్వేలో వెల్లడైన అంశాల ఆధారంగా రుణాల మంజూరులో మార్పులు, చేర్పులు చేస్తున్నారు. సంఘాలకు రుణాలు ఇవ్వడం వల్ల ఎవరికీ పూర్తి స్థాయిలో డబ్బులు సరిపోక సరియైన స్థాయిలో వ్యాపారాలు చేసుకోలేకపోత్నున్నారని గుర్తించారు. దీంతో సభ్యులకు వ్యక్తిగత రుణాలు అందజేస్తున్నారు. ఎంటర్ప్రైజెస్ పథకం ద్వారా 2021-22లో కనిష్ఠంగా రూ.75 వేల రుణాన్ని అందించారు. సగటున రూ.1.25 లక్షలు ఇచ్చారు. ఈ ఏడాది రూ.2 లక్షల వరకు రుణం ఇప్పించాలని నిర్ణయించారు.
వెదురు బొమ్మలకు గిరాకీ
మేము వెదురు కర్రలతో అందమైన బొమ్మలను తయారు చేస్తాం. ముడిసరుకు కొనడానికి బ్యాంకుల నుంచి లోన్లు ఇప్పిస్తున్నారు. మేము తయారు చేసిన వస్తువులకు మంచి గిరాకీ ఉంటున్నది. గిఫ్ట్లు ఇవ్వడానికి ఎక్కువగా కొంటున్నారు. సర స్ ఎగ్జిబిషన్లో మా ఉత్పత్తులను పెడు తాం. మా కుటుంబ సభ్యులందరం కలిసి ఈ పనులు చేస్తాం. నారాయణపేటలో షాపు పెట్టాలనుకుంటున్నాం. కలెక్టర్ షాపు కేటాయించగానే పెడుతాం.
– లక్ష్మీదేవి, నారాయణపేట జిల్లా
నాకు అవార్డులు వచ్చాయి
నేను, మా కుటుంబ సభ్యులం అంద రం కలిసి చేనేత చీరలు నేస్తం. మెటీరియల్ కొనడానికి, ఎక్కువ వెరైటీలు తయారు చేయడానికి బ్యాంకు ద్వారా లోన్లు ఇప్పించారు. గతంలో పైసలు లేక చీరలు మాత్ర మే తయారు చేసే వాళ్లం. ఇప్పుడు బెడ్షీట్లు, డ్రెస్ మెటీరియల్, టవల్స్, కర్చీఫ్లు తయారు చేస్తున్నాం. నాకు అవార్డులు కూడా వచ్చాయి. మా పిల్లలను మంచిగా చదివిస్తున్నాం. బ్యాంకు లోన్లు మంచిగా ఉపయోగపడ్డాయి.
– సత్యలక్ష్మి, నిర్మాల గ్రామం, దేవరుప్పుల మండలం, జనగామ జిల్లా