జగదేవ్పూర్/బీబీనగర్, జనవరి 10: సిద్దిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన కల్వర్టు గోడను ఢీకొని కెనాల్లోకి కారు దూసుకెళ్లడంతో ఐదుగురు ప్రాణాలు విడిచారు. కారు తలకిందులుగా పడటంతో బురద గుంతలో ఊపిరాడక వారు మరణించారు. మరొకరు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషాదకర ఘటన జగదేవ్పూర్ మండలం మనిగడప వద్ద మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకున్నది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్కు చెందిన బొల్లు సమ్మయ్య-స్రవంతి దంపతులు తమ కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వరస్వామి దర్శనానికి కారులో వెళ్లారు. సోమవారం రాత్రి వేములవాడలోనే బస చేశారు.
మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తిరిగి ఇంటికి వస్తుండగా సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం మునిగడప గ్రామంలోని ఎల్లమ్మ ఆలయం వద్ద వారు ప్రయాణిస్తున్న కారు కొండపోచమ్మ సాగర్ పంపింగ్ కల్వర్టును బలంగా ఢీకొట్టి పక్కనే ఉన్న కాలువ గుంతలో బోల్తాపడింది. కారు డోర్లు తెరుచుకోకపోవడంతో బురద నీరు మింగి ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. మరోవ్యక్తి వెంకటేశ్ ప్రాణాపాయస్థితిలో ఉండటంతో ఎస్సై కృష్ణమూర్తి తన సిబ్బందితో బయటకు తీసి చికిత్స నిమిత్తం గజ్వేల్ సర్కారు దవాఖానకు తరలించారు.
ఈ ఘటనలో సమ్మయ్య (40), అతని భార్య స్రవంతి (32), కూతురు భవ్యశ్రీ (15), కొడుకు లోకేశ్ (12), బొమ్మల రామారం మండలం మల్యాల గ్రామానికి చెందిన సమ్మయ్య అత్త రాజమణి (48) మృతిచెందారు. సమ్మయ్య మామ వెంకటేశ్ చికిత్స పొందుతున్నాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ సర్కారు దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు గజ్వేల్ ఏసీపీ రమేశ్ తెలిపారు. ఈ ఘటనతో సమ్మయ్య స్వగ్రామమైన బీబీనగర్లో విషాదఛాయలు అలుముకున్నాయి.