BJP | హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): బీజేపీలో ముసలం ముదురుతున్నది. పార్టీలో బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందన్నది బహిరంగ రహస్యమే. బండి సంజయ్ని అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఈటల రాజేందర్.. పార్టీలో ఈటలకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని తగ్గించాలని బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారని తెలిసిందే. ఇందుకోసం అధ్యక్షుడిగా బండి ఫెయిల్ అని నిరూపించేందుకు ఈటల వర్గం, చేరికల కమిటీ చైర్మన్గా ఈటల విఫలం అయ్యారని నిరూపించేందుకు బండి వర్గం ప్రయత్నిస్తున్నదని మొదటి నుంచీ వాదనలు ఉన్నాయి. మునుగోడు ఉప ఎన్నిక అనంతరం ఈ ప్రచారం మరింత పెరిగింది. తాజాగా వీరి ఆధిపత్య పోరు ‘లీకుల’ బాట పట్టింది. ఈటల తన అనుచరుల ద్వారా లీకులు ఇస్తుంటే.. బండి సంజయ్కి వాటికి కౌంటర్లు ఇచ్చేందుకే సమయం సరిపోతున్నది. దీంతో ఈటలకు వ్యతిరేకంగా బండి అనుకూల నేతలు ఢిల్లీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకొన్నట్టు తెలిసింది.
ఈటల రాజేందర్కు ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్గా బాధ్యతలు అప్పగిస్తారంటూ తాజాగా ఈటల వర్గం లీకులు ఇచ్చింది. దీంతో ఆ పార్టీలో ఒక్కసారిగా అలజడి మొదలయ్యింది. అలాంటి వార్తలను నమ్మవద్దని బీజేపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో ప్రకటించింది. మరోవైపు ఆదివారం హైదరాబాద్లోని మాజీ ఎంపీ జితేందర్రెడ్డి ఇంట్లో బీజేపీ సీనియర్ నేతలు రహస్యంగా భేటీ అయ్యారు. కొండా విశ్వేశ్వర్రెడ్డి, విజయశాంతి, బూర నర్సయ్యగౌడ్, విఠల్, సుద్దాల దేవయ్య ఈ భేటీలో పాల్గొన్నారు. ఈటల రాజేందర్కు ఎన్నికల నిర్వహణ బాధ్యతలు అప్పగించడంపై వారు అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తాము కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని, ఈటలకు పదవి ఇస్తే, తమకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని వారు చర్చించినట్టు సమాచారం. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఈటల రాజేందర్ కావాలనే తన అనుచరుల ద్వారా ఇలాంటి లీకులు వదులుతూ, ఆందోళనకర వాతావరణాన్ని సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
ఈటల రాజేందర్ చేరినప్పటి నుంచీ బీజేపీలో లీకుల జాతర మొదలయ్యింది. ఈటల చేరిన కొన్నాళ్లకే.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తారంటూ ప్రచారం చేసుకొన్నారు. దీంతో ఈటలను పార్టీ అంతర్గత సమావేశాలకు కావాలనే బండి దూరం పెట్టి అక్కసు తీర్చుకున్నారని ప్రచారం సాగింది.