Congress | హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు నిత్యం ఆ పార్టీలో ఏదో ఒక అసంతృప్తి రగులుతూనే ఉన్నది. పార్టీలో, ప్రభుత్వంలో సీఎం రేవంత్రెడ్డి వన్ మ్యాన్ షోను సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా పార్టీలో, ప్రభుత్వంలో తమకు సరైన గుర్తింపు లభించడం లేదంటూ బీసీ నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. పీసీసీ నాయకత్వ తప్పిదాలను ఎత్తిచూపిన బీసీ నేతలపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరిస్తుండటం, అదే సమయంలో క్రమశిక్షణ మీరిన రెడ్డి సామాజికవర్గం నాయకుల విషయంలో నిశ్శబ్దంగా ఉండటాన్ని తట్టుకోలేకపోతున్నారు.
బీసీ నాయకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే.. ఎంతటి సీనియర్లు అయినా క్రమశిక్షణ చర్యలు తప్పవని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ సోమవారం హెచ్చరించడం అగ్నికి ఆజ్యం పోసినట్టుగా అయిందని నేతలు చెప్పుకుంటున్నారు. పార్టీలోని తాజా పరిణామాలు చూస్తుంటే ‘బీసీ వర్సెస్ రెడ్డి’గా మారేటట్టు ఉందని సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ మేలు కోరి సూచనలు చేస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం దేనికి సంకేతమని బీసీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. రేవంత్రెడ్డిపై గతంలో కోమటిరెడ్డి సోదరులు, జగ్గారెడ్డి వంటి నేతలు ఎన్ని ఆరోపణలు చేసినా పల్లెత్తు మాట అనకుండా, ఈ రోజు బీసీ నాయకులను హెచ్చరించడం ఏమిటని నిలదీస్తున్నారు.
ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి మాణిక్కం ఠాగూర్కు డబ్బులు ఇచ్చి రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవిని కొనుక్కున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో ఆరోపించినా కాంగ్రెస్ అధిష్ఠానం స్పందించలేదు. మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన సోదరుడు రాజగోపాల్రెడ్డిని గెలిపించాలని వెంకట్రెడ్డి బాహాటంగా పిలుపునిచ్చారు. దీనిపై ఏఐసీసీ ఆయనకు షోకాజ్ నోటీసు ఇస్తే, దానిని చెత్తబుట్టలో పడేసినట్టు మీడియా ముఖంగా చెప్పినా ఆయనపై చర్యలు తీసుకోలేదు. రాజగోపాల్రెడ్డి అయితే తాను రేవంత్రెడ్డి నాయకత్వంలో పనిచేయలేకే బీజేపీలో చేరినట్టు ప్రకటించారు.
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అయితే పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డిని తప్పించని పక్షంలో తన పదవికి రాజీనామా చేస్తానని ఏకంగా రాహుల్గాంధీకే లేఖ రాశారు. అయినా క్రమశిక్షణ చర్య తీసుకుంటామని వీరిని హెచ్చరించిన దాఖలాలు లేవు. సీనియర్ బీసీ నాయకులు నిరంజన్, వీ హనుమంతరావు ఇద్దరూ ఎంపీ టికెట్ల కేటాయింపులో పార్టీనే నమ్ముకున్న వారికి అన్యాయం జరుగుతున్నదని అంటే మాత్రం క్రమశిక్షణ చర్యలు తప్పవని మరో బీసీ నాయకుడు మహేశ్కుమార్గౌడ్ హెచ్చరించడం పార్టీలో తీవ్ర చర్చకు కారణమైంది. పార్టీలో, ప్రభుత్వంలో బడుగు బలహీన వర్గాలు, బీసీ నాయకులపై ఒకలా, రెడ్డి సామాజికవర్గ నాయకులపై మరోలా పీసీసీ నాయకత్వం వ్యవహరిస్తున్నదన్న సీనియర్లు మండిపడుతున్నారు.
రాష్ట్ర కాంగ్రెస్లో మున్నూరుకాపు సామాజిక వర్గం నాయకులకు టార్గెట్ చేస్తున్నారని రాష్ట్ర మున్నూరు కాపు యువక మండలి ప్రధాన కార్యదర్శి ఎస్పీ క్రాంతికుమార్ ఒక ప్రకటనలో ఆరోపించారు. పార్టీలో ఇటీవల జరుగుతున్న చేరికలు, ఎంపీ టికెట్ల కేటాయింపుపై పార్టీ సీనియర్లు తమ అభిప్రాయాలు వ్యక్తంచేస్తే తప్పేమిటని ప్రశ్నించారు. వివిధ అంశాలపై సీనియర్ నాయకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడం కొత్త విషయం ఏమీ కాదని పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర మాజీమంత్రి, సీనియర్ నేత ఆనంద్శర్మ కుల గణనపై తన అభిప్రాయాన్ని అధినాయకత్వానికి బాహాటంగానే తెలియజేశారని గుర్తుచేశారు.
మరెంతోమంది నాయకులు తమ అభిప్రాయాలను లేఖల రూపంలో, మీడియా ద్వారా తెలియజేస్తున్నా వారిపై చర్యలు తీసుకుంటామని అధిష్ఠానం హెచ్చరించ లేదని తెలిపారు. ఇప్పుడు మాత్రం మున్నూరుకాపు సామాజికవర్గ నేతలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం ఏమిటని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ల విషయంలోనూ మున్నూరుకాపు నేతలను పార్టీ తీవ్రంగా అవమానించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 50 లక్షల పైగా జనాభా ఉన్న మున్నూరుకాపులకు బీఆర్ఎస్, బీజేపీ సముచిత స్థానం ఇస్తున్నాయని, కాంగ్రెస్ మాత్రం వారిని పొమ్మనలేక పొగబెట్టాలని చూస్తున్నదని ఆరోపించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పదవులు, ప్రభుత్వంలో కీలక శాఖలు రెడ్డి సామాజిక వర్గానికే దక్కాయన్న చర్చ పార్టీలో జరుగుతున్నది. నామినేటెడ్ పోస్టుల్లోనూ తమకు ప్రాధాన్యం లేని పోస్టులు కట్టబెట్టారని బీసీ నాయకులు వాపోతున్నారు. అసెంబ్లీ టికెట్లలో విషయంలో జరిగిన అన్యాయాన్ని పార్లమెంటు ఎన్నికల్లోనైనా సరిదిద్దుతారనుకుంటే ఇప్పుడు కూడా నిరాశే మిగిలిందని వాపోతున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కను చిన్నచూపు చూస్తున్నారని, మాదిగలకు పార్టీలో అన్యాయం జరుగుతున్నదని చెప్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే పార్టీకి ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.