హైదరాబాద్, మార్చి 28(నమస్తే తెలంగాణ) : వానకాలంలో పంటల సాగుకు అవసరమైన విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచాలని అధికారులు, విత్తన కంపెనీలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. గురువారం వానకాలం సాగు, విత్తనాల లభ్యతపై సచివాలయంలో సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్రంలో రెండవ ప్రధాన పంటగా ఉన్న పత్తి వానకాలం దాదాపు 60.53 లక్షల ఎకరాలలో సాగయ్యే అవకాశం ఉందని, ఇందుకు 121.06 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్లు అవసరమని చెప్పారు. అలాగే వరి సాగుకు 16.50 లక్షల క్వింటాళ్లు, మొకజొన్న సాగుకు 48 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని తెలిపారు. రాష్ట్ర అవసరాలనే మొదటి ప్రాధాన్యతగా ప్రైవేట్ విత్తన కంపెనీలు గుర్తించి విత్తనాలు సరఫరా చేయాలని ఆదేశించారు.