హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర గడ్డ మీద గులాబీ జెండా ఎగురకూడదు.. బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట జనం వినకూడదనే మహారాష్ట్రలోని బీజేపీ సర్కారు కుట్రలను ప్రజలు ఛేదించారు. ఆదివారం నాందేడ్లోని కంధార్-లోహాలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన బహిరంగసభకు ప్రజలను రాకుండా అక్కడి బీజేపీ నాయకులు అడ్డుకొన్నారు. నాందేడ్ జిల్లాలోని పలు తాలూకా కేంద్రాలు, పంచాయత్లు, కంధార్, లోహ పట్టణాల్లో యువతకు పెద్ద ఎత్తున దావత్లు ఇచ్చారు. గ్రామాల్లో గొర్లు, మేకలు కోసి భోజనాలు పెట్టారు. వ్యవసాయ క్షేత్రాల్లో అధికారులు వస్తున్నారని ప్రచారం చేసి, రైతులను సభకు రాకుండా కుట్ర పన్నారు. గ్రామాల్లో ఆటో అడ్డాల దగ్గర యువకులను పెట్టి ఎవరూ సమావేశానికి వెళ్లకుండా ఏర్పాట్లు చేశారు. ఇలాంటి విఘ్నాలను ఛేదించుకొని రైతులు, మహిళలు, యువకులు భారీ సంఖ్యలో లోహ బహిరంగ సభా ప్రాంగణానికి చేరువ కాగానే.. అక్కడి నుంచి దారి మళ్లించారు. ఇలాంటి అనేక కుట్రలను ఛేదించుకొంటూ.. ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అని నినదిస్తూ ప్రజలు బీఆర్ఎస్ బహిరంగ సభకు తండోపతండాలుగా తరలివచ్చారు. కొందరు కుటుంబ సమే తంగా స్వచ్ఛందంగా ద్విచక్రవాహనాలపై సభాస్థలికి చేరుకొన్నారు. ముఖ్యంగా రైతులు పెద్దసంఖ్యలో వివిధ వాహనాల్లో తరలి వచ్చారు. యువత సైతం గుంపులు, గుం పులుగా బీఆర్ఎస్ పార్టీ సభకు హాజ రయ్యారు. సభా ప్రాంగణంలో ‘దేశ్ కీ నేత కైసే హో… కేసీఆర్ కీ జైసే హో’ అంటూ గులాబీ దళపతి, సీఎం కేసీఆర్కు మరాఠ్వాడ బ్రహ్మరథం పట్టింది.