హైదరాబాద్/సిటీబ్యూరో, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే జీ సాయన్న (72) అనారోగ్యంతో కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న సాయన్నకు ఆదివారం ఉదయం షుగర్ లెవెల్స్ పడిపోవడంతో కుటుంబసభ్యులు సికింద్రాబాద్ యశోద దవాఖానకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మధ్యాహ్నం 1.45 గంటలకు మరణించినట్టు వైద్యులు తెలిపారు. సాయన్న మృతదేహాన్ని కుటుంబసభ్యులు దవాఖాన నుంచి అశోక్నగర్లోని నివాసానికి తరలించారు. ఆయన మృతి వార్త తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. సాయన్న నివాసానికి చేరుకుని పార్థివదేహానికి నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులను ఓదార్చారు. వారికి ధైర్యం చెప్తూ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎమ్మెల్యేగా సాయన్న చేసిన ప్రజాసేవను, ఆయనతో తనకున్న అనుబంధాన్ని సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. సోమవారం మ ధ్యాహ్నం 2 గంటలకు మారేడుపల్లిలోని హిందూ శ్మశానవాటికలో అధికారిక లాంఛనాలతో అంత్య క్రియలు నిర్వహించనున్నారు. సాయన్న పార్థివదేహాన్ని ప్రజల సందర్శనార్థం సోమవారం ఉదయం కార్ఖానాలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి తరలించనున్నారు.
సాయన్న 1951 మార్చి 5న జన్మించారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సాయన్న బీఎస్సీ, ఎల్ఎల్బీ చదివారు. వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నారు. టీడీపీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ తరఫున 1994, 1999, 2004, 2014 ఎన్నికల్లో విజయం సాధించిన సాయన్న 2009లో ఓటమి చెందారు. ఆ తర్వాత బీఆర్ఎస్లో చేరిన సాయన్న 2018 ఎన్నికల్లో ఐదోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2015లో టీటీడీ పాలకమండలి సభ్యుడిగా పనిచేశారు. హుడా డైరెక్టర్గా ఆరుసార్లు బాధ్యతలు నిర్వర్తించారు. వీధి బాలలకు పునరావాసంపై ఏర్పాటైన హౌస్ కమిటీ చైర్మన్గా పనిచేశారు.
కేటీఆర్ సహా పలువురు ప్రముఖుల సంతాపం
సాయన్న మృతికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్తోపాటు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. సాయన్న సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ ప్రజలకు ఎనలేని సేవలు అందించారని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, ఎమ్మెల్సీ కవిత ప్రార్థించారు. సంతాపం తెలిపినవారిలో స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, ఉపసభాపతి టీ పద్మారావుగౌడ్, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, మహమూద్ అలీ, సీహెచ్ మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, జీ జగదీశ్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, వీ శ్రీనివాస్గౌడ్, పువ్వాడ అజయ్కుమార్, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితరులున్నారు. ఎంపీలు బీబీ పాటిల్, డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, వాణీదేవి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, అరికెపూడి గాంధీ, మాగంటి గోపీనాథ్, కార్పొరేషన్ల చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, గజ్జెల నగేశ్, రాజీవ్సాగర్, మాజీ కేంద్ర మంత్రి ఎస్ వేణుగోపాలాచారి, బీఆర్ఎస్ నేతలు తలసాని సాయికిరణ్యాదవ్, ఎంఎన్ శ్రీనివాసరావు, జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతాశోభన్రెడ్డి, రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్, ప్రజాగాయకుడు గద్దర్, మాజీ ఎంపీలు అంజన్కుమార్యాదవ్, కంభంపాటి రామ్మోహన్రావు, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ సలీం, పిడమర్తి రవి తదితరులు సాయన్న మృతదేహం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు.
అలా అయితే ఉప ఎన్నిక ఉండదు: ఈసీ
హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): ఎన్నికల నియమావళి ప్రకారం సాధారణంగా ఎమ్మెల్యే లేదా ఎంపీ రాజీనామా చేసినా, మరణించినా ఆ స్థానానికి ఆరు నెలల్లోపు ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. కానీ, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రం ఉప ఎన్నిక నిర్వహించడం కుదరదని ఎన్నికల సంఘం పేర్కొన్నది. సదరు ప్రజాప్రతినిధి పదవీకాలం ఏడాది కన్నా తక్కువగా ఉన్నా, ఆ స్థానంలో ఎన్నికలు నిర్వహించడం కష్టమని ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వం భావించినా ఆ స్థానానికి ఉపఎన్నిక ఉండదని స్పష్టంచేసింది.