హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర ప్రారంభమైంది. ఆదివారం ఉదయం 4 గంటలకే లష్కర్ బోనాలు ఆరంభమయ్యాయి. ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. వేకువజాము నుంచే భక్తులు అమ్మవారికి బోనం సమర్పించడానికి ఆలయానికి బారులుతీరారు. బోనం ఎత్తుకుని వచ్చే మహిళా భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. జాతర సందర్భంగా 2,500 మంది పోలీసులతో బందోబస్తు చేపట్టారు. మాస్కు ధరించని వారిని అమ్మవారి దర్శనం కోసం అనుమతించమని పోలీసులు తెలిపారు. ఇవాళ సీఎం కేసీఆర్ మహంకాళి అమ్మవారిని దర్శించుకోనున్నారు. సోమవారం రంగం వేడుక నిర్వహించనున్నారు.
ఈ ఏడాది బోనాల జాతరకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఆలయాల అలంకరణ, పూజల నిర్వహణకు రూ.15 కోట్లు కేటాయించింది. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా తగిన ఏర్పాట్లు చేసింది. వేడుకలను తిలకించేందుకు ప్రధాన ప్రాంతాల్లో ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసింది.