NTPC | హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్న కేంద్ర ప్రభుత్వం.. అనేక విభజన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నది. తాజాగా మోదీ సర్కారు మరో విభజన హామీని తొక్కిపెట్టింది. ఏపీ పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 13 ప్రకారం తెలంగాణ విద్యుత్తు అవసరాలు తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో పదేండ్లలోగా 4 వేల మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉన్నది. ఈ ప్రాజెక్టుకు తగినన్ని బొగ్గు కేటాయింపులు జరిపి, ఎలాంటి కొరత లేకుండా చూడాలని విభజన చట్టం స్పష్టం చేసింది. దశాబ్ది ఉత్సవాలకు తెలంగాణ సిద్ధమవుతున్నప్పటికీ మోదీ సర్కారు ఈ హామీని పూర్తిగా నెరవేర్చలేదు. ఈ ప్రాజెక్టు మొదటి దశ పనులు ప్రారంభమైనప్పటికీ రెండో దశకు మాత్రం ఏడేండ్లుగా అనుమతులు ఇవ్వడం లేదు. ప్లాంటు రెండో దశ ఏర్పాటుపై ఆర్టీఐ కార్యకర్త ఇనగంటి రవికుమార్ ఇటీవల కేంద్ర విద్యుత్తు శాఖను, ఎన్టీపీసీని వివరాలు కోరడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
కేంద్రం ఏం చేసింది?
రెండు దశల్లో సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టులను నిర్మించాలని ప్రణాళికలు రచించిన ఎన్టీపీసీ.. మొదటి దశలో 1,600 మెగావాట్లు (800 మెగావాట్లతో కూడిన 2 యూనిట్లు), రెండో దశలో 2,400 మెగావాట్ల (800 మెగావాట్లతో కూడిన 3 యూనిట్లు) ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా రూ.10,599 కోట్లతో మొదటి ప్లాంట్ పనులను ప్రారంభించింది. ఇందులో ఇప్పటివరకు రూ.10,437 కోట్లు ఖర్చుచేసి 96% పనులను పూర్తిచేసినట్టు కేంద్రం చెప్తున్నది. మొదటి దశకు సంబంధించి 2016లో తెలంగాణ ప్రభుత్వంతో విద్యుత్తు కొనుగోలు ఒప్పందం చేసుకున్నది. దాని ప్రకారం 2019 ఫిబ్రవరి నాటికి రాష్ర్టానికి విద్యుత్తును సరఫరా చేయాల్సి ఉన్నది.
ఇందుకు అవసరమయ్యే బొగ్గును సింగరేణి నుంచి ‘శక్తి’ పాలసీ ద్వారా సరఫరా చేసేందుకు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కేటాయింపులు జరిపింది. ఈ గడువు దాటిపోయి నాలుగేండ్లు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తిస్థాయిలో విద్యుత్తు సరఫరా కావడం లేదు. రెండో దశలో నిర్మించాల్సిన 3 యూనిట్లకు సంబంధించిన అంచనాలు, ఫీజబిలిటీ రిపోర్ట్ను కాంపిటెంట్ అథారిటీ 2016 మొదటి త్రైమాసికంలోనే కేంద్రానికి సమర్పించింది. నిర్మాణానికి రూ.17739 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. అయినా ఇప్పటివరకు రెండో దశ నిర్మాణానికి కేంద్రం నుంచి అనుమతులు మంజూరు కాలేదు. కనీసం ఎన్టీపీసీ నుంచి పెట్టుబడి అనుమతులు కూడా రాలేదని ఆర్టీఐ ద్వారా వెల్లడైంది.
రెట్టింపు కానున్న అంచనా వ్యయం
ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త ధరల ప్రకారం మళ్లీ అంచనాలను సవరించాల్సి ఉంటుంది. ఈ అంచనాలు దాదాపు రెట్టింపయ్యే అవకాశాలున్నాయి. కనీసం రూ.25 వేల కోట్లకైనా చేరుకుంటుందని నిపుణుల అంచనా. విభజన చట్టంలో నిర్దేశించిన హామీకి గడువు పదేండ్లు పూర్తి కావడానికి మరో సంవత్సరం సమయం మాత్రమే మిగిలి ఉన్నది. ప్రాజెక్టు పూర్తిచేయాల్సిన కాలంలో కనీసం కొత్త అంచనాలు రూపొందించి, వాటికి అనుమతులైనా ఇస్తారో లేదో అన్నది సందేహంగా మారింది. రెండో దశ యూనిట్ల నిర్మాణాలు ప్రారంభమైతే వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.